అక్రమసంబంధం: భర్తను చంపేసింది: భార్య, ప్రియుడికి యావజ్జీవ శిక్ష!
చెన్నై: తమిళనాడులో భర్తను హత్య చేసిన కేసులో భార్యకి, ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పొన్నేరి న్యాయస్థానం తీర్పు చెప్పింది. అస్సోం రాష్ట్రానికి చెందిన సుధీప్, ఇతని భార్య అనియా తమిళనాడు చేరుకుని పొన్నేరి సమీపం సెంగుండ్రం బాలవాయల్ లో నివాసం ఉండేవారు.
సుధీప్ ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీగా పనిచేసేవాడు. అస్సోం రాష్ట్రానికి చెందిన నిర్మల్ సర్కార్ పొన్నేరి చేరుకుని ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గా ఉద్యోగం చేస్తున్నాడు. నిర్మల్ సర్కార్, అనియాకు పరిచయం అయ్యింది.
నిర్మల్ సర్కార్, అనియా పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న సుదీప్ భార్య అనియాని మందలించాడు. అయితే అనియా మాత్రం నిర్మల్ సర్కార్ తో తన వివాహేతర సంబంధం కొనసాగించింది. అనియా తీరు మారలేదని సుధీప్ ఒక్క సారి భార్యను చితకబాదేశాడు.
తన భర్త అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన అనియా 2015 సంవత్సరంలో ప్రియుడు నిర్మల్ సర్కార్ తో కలిసి ఇంటిలో నిద్రపోతున్న సుధీప్ తల మీద రోకలితో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనియా, నిర్మల్ సర్కార్ ను అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం అనియా, నిర్మల్ సర్కార్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.