షాకింగ్ : తమిళ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య... ఫ్యాన్కు ఉరేసుకుని...
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటుడు ఇంద్ర కుమార్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. పెరంబలూర్లోని తన స్నేహితుడి నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోస్టార్ సందీప్ ఆత్మహత్య మరిచిపోకముందే మరో నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం కలకలం రేపుతోంది.
తమిళ మీడియా కథనం ప్రకారం... గురువారం(ఫిబ్రవరి 18) రాత్రి ఇంద్ర కుమార్ తన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లాడు. సినిమా తర్వాత పెరంబలూరులోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. మరుసటిరోజు ఉదయం ఆ గదిలో అతను సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఇంద్ర కుమార్ స్నేహితుడు పోలీసులకు సమాచారమిచ్చాడు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైవాహిక జీవితంలోనూ అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఇంద్ర కుమార్కు భార్య,ఒక పాప ఉన్నారు. శ్రీలంకన్ తమిళ్ అయిన ఇంద్ర కుమార్ కొన్నేళ్లు చెన్నైలోని శరణార్థి శిబిరంలో ఉన్నాడు. తమిళంలో పలు టీవీ సీరియల్స్లో నటించాడు. అయితే సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇటీవల బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ కూడా ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోనీ, కేసరి వంటి చిత్రాల్లో సందీప్ నహర్ నటించాడు. ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్తో కలిసి నటించాడు. కేసరి సినిమాలో అక్షయ్ కుమార్తో కలిసి కీలక పాత్ర పోషించాడు.ఆత్మహత్యకు ముందు సందీప్ సూసైడ్ నోట్ పేరిట ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అందులో తన కాపురం సవ్యంగా సాగలేదని, ఈ జీవితం తనకు నరకప్రాయంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి రోజూ తన భార్య కాంచన శర్మ తనను వేధిస్తుందని, తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని, ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తుంటారని వాపోయాడు. సందీప్ ఆత్మహత్యపై ప్రస్తుతం ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.