రాజకీయాల్లో పాపులారిటీ పనికిరాదు, రజనీ అక్కడి నుంచి పోటీ చేయగలరా?: శరత్ కుమార్
చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఏర్పడిన ఈ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఎత్తుగడలో బీజేపీ రాష్ట్ర రాజకీయాలను మరింత భ్రష్టు పట్టించిందన్న విమర్శలున్నాయి.
అన్నాడీఎంకె పార్టీని బీజేపీ పూర్తిగా తమ కనుసన్నుల్లో నడిపిస్తోందన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ అస్తిత్వాన్ని కాపాడే లక్ష్యంతో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్స్ రాజకీయాల వైపు అడుగేసిన సంగతి తెలిసిందే. కమల్ ఇప్పటికే 'మక్కల్ నీది మయ్యం' పేరుతో రాజకీయ తెరంగేట్రం చేయగా.. రజనీ మాత్రం రేపు, మాపు అంటూ ఇంకా నాన్చుతూనే ఉన్నారు.
అయితే ఈ ఇద్దరు స్టార్స్ కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన మరో తమిళ నటుడు ఉన్నారు. ఆయనే శరత్ కుమార్. ఏఐఎస్ఎంకే(ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి) పార్టీని స్థాపించిన ఆయన.. ప్రస్తుతం పార్టీ నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రజనీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'రాజకీయాల్లోకి రాగానే వారిద్దరికీ(కమల్, రజనీ) ఓ విషయం అర్థమై ఉంటుంది. సినిమాల్లో ఉన్నట్టు రాజకీయాల్లో స్టార్లు ఉండరని. నా అనుభవం ప్రకారం..రాజకీయాల్లో పాపులారిటీ పనికిరాదు.
అంతెందుకు షారుక్ ఖాన్ తన 'లుంగి డ్యాన్స్' పాట కోసం రజనీ పేరు వాడుకున్నారు. దేశవ్యాప్తంగా రజనీకి అంత పాపులారిటీ ఉంటే మహారాష్ట్రలో ఆయన పోటీ చేస్తారా?. కాబట్టి రాజకీయాల్లో పాపులారిటీ కంటే సమాజానికి చేసే సేవకే ఎక్కువ విలువ. తమిళనాడు విషయానికొస్తే.. రాష్ట్రాన్ని పాలించాలనుకునేవాళ్లకు కచ్చితంగా ఇక్కడి సంస్క్రతి, సాంప్రదాయాలపై అవగాహన ఉండి తీరాలి' అని శరత్ కుమార్ అన్నారు.
రజనీని లక్ష్యంగా చేసుకుని శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పైగా తమిళనాడును పాలించాలనుకునేవాళ్లకు ఇక్కడి సంస్క్రతి, సాంప్రదాయాలు తెలిసి ఉండాలని ఆయన పేర్కొనడం.. రజనీ మహారాష్ట్రకి చెందిన వ్యక్తి అని పరోక్షంగా గుర్తుచేయడం లాగే అనిపించింది. ఏదేమైనా ఇప్పటికీ పార్టీని ప్రకటించని రజనీ.. అసలైన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడిస్తారో వేచి చూడాల్సిందే!