నిన్న రష్మిక మందన్న..నేడు హీరో విజయ్: ఐటీ రెయిడ్స్: షూటింగ్ స్పాట్కు వెళ్లి మరీ..!
చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై దాడులు చేపట్టిన ఐటీ అధికారులు తాజాగా విజయ్ని టార్గెట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. విజయ్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.
ఐటీ అధికారుల అదుపులో రష్మిక మందన్న: సమన్లు జారీ..కాస్సేపట్లో విచారణ.. !
విజయ్ హీరోగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద బిగిల్ సినిమా తెరకెక్కింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బడ్జెట్ సుమారు 120 కోట్ల రూపాయలుగా తేలింది. ఆ సందర్భంగా అన్బు చెలియన్ సహా ఏజీఎస్ సినిమాస్ సంస్థ నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఆదాయపు పన్నులను లెక్క చూపలేదని చెబుతున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం విషయంలో సరైన సమాచారాన్ని ఇవ్వలేదనే కారణంతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని అంటున్నారు.
తమిళనాడులోని మధురైలో అన్బు చెలియన్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిపై దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు. కాగా- ప్రస్తుతం విజయ్ తన తదుపరి సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న మాస్టర్ మూవీ సెట్స్పై ఉంది. ఈ సినిమా షూటింగ్ కడలూర్ జిల్లాలోని నైవేలీలో కొనసాగుతోంది. ఆదాయపు పన్ను అధికారులు నైవేలికి వెళ్లి.. విజయ్ను ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటకలోని విరాజ్పేటలో రష్మిక మందన్న నివాసంపై కొద్దిరోజుల కిందటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లెక్క చూపని నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చోటు చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ సారి తమిళ మాస్ హీరో విజయ్పై ఐటీ అధికారులు నిఘా ఉంచడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టించింది. షూటింగ్ స్పాట్కు వెళ్లి మరీ ఆయనను ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.