ఖుష్బూ రాజకీయం: తొలుత డీఎంకే.. తాజాగా కాంగ్రెస్కూ గుడ్బై: ఇక బీజేపీలోకి: ఎన్నికల బరిలో
న్యూఢిల్లీ: దక్షిణాది నటి ఖుష్బూ కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ఖాయమైంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకేతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి కూడా అన్నా డీఎంకే అధికారంలోకి రావడమంటూ జరిగితే.. ఖుష్బూకు మంత్రిపదవి ఆఫర్ చేస్తారనే వార్తలు తమిళనాడులో వినిపిస్తున్నాయి.
Recommended Video
2010లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బూ. తొలుత డీఎంకేలో చేరారు. నాలుగేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారి ప్రతినిధురాలుగా కొనసాగుతున్నారు. తాాజాగా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. బీజేపీలో చేరడానికి సన్నాహాలు పూర్తి చేశారని తమిళనాడు మీడియా వెల్లడించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేస్తారని, ఆమెకు పార్టీలో కీలక పదవిని, బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది.
తాను కాంగ్రెస్ కొనసాగాలని అనుకోవట్లేదంటూ కొద్దిరోజుల కిందటే ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఎంతో కాలం తాను పార్టీలో కొనసాగబోననీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జాతీయ నూతన విద్యావిధానాన్ని ఆమె స్వాగతించారు. సమర్థించారు. ఈ మేరకు అప్పట్లో ఆమె చేసిన ట్వీట్ తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. బీజేపీకి ఆమె చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాను ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని ఖుష్బూ అప్పట్లో స్పష్టం చేయలేదు. తాజాగా ఖుష్బూ బీజేపీలో చేరబోతున్నారని తేలింది.