పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?
ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ ను షేక్ చేస్తుండగా, తాజాగా తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం కోలీవుడ్ నూ కుదిపేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఇంటా, బయటా ఒత్తిళ్లే ప్రధానాంశంగా ఉన్నాయి. నెపోటిజం కారణంగా సుశాంత్ ఏకాకిలా ఫీలై బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడికాగా, విజయలక్ష్మి వ్యవహారంలో రాజకీయ పార్టీల వేధింపుల ప్రమేయం కూడా ఉండటం గమనార్హం. అభిప్రాయలతో విభేదించిన కారణంగా కొన్నాళ్లుగా తనపై వేధింపులకు పాల్పడుతున్నారని, ఏవైపు నుంచీ సహాయం అందని స్థితిలో మరణమే శరణ్యమంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది.
Recommended Video
జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు
పోలీసులకు చెప్పినా..
ఆర్యా, నయనతార జంటగా వచ్చిన ‘నేనే అంబానీ' సినిమాతో పాపులారిటీ సాధించిన తమిళనటి విజయలక్ష్మి ఆదివారం సూసైడ్ అటెంప్ట్ చేశారు. చెన్నైలో ఉండగానే ఆమె ఈ పని చేశారని తొలుత వార్తలు వచ్చినా, ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉన్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. తన ఫ్లాట్ లో దాదాపు స్పృహకోల్పోయిన ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు సోషల్ మీడియాలో ఓ లైవ్ వీడియోను చేసిన ఆమె.. తానింత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి రెండు రాజకీయ పార్టీలే కారణమని, వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇది నా చివరి వీడియో..
‘‘ఇప్పుడే బీపీ ట్యాబ్లెట్లు వేసుకున్నాను. కాసేపట్లో బీపీ పూర్తిగా పడిపోయి నేను చనిపోతాను. ఇది నా చివరి వీడియో, నా మరణం అందరికీ కనువిప్పు కావాలి. ఇకపై ఎవరికీ బానిసగా ఉండదల్చుకోలేదు. రాజకీయ పార్టీలు స్థాపించిన ఇద్దరు మాజీ నటులు, వాళ్ల అభిమానులు నన్ను దారుణంగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో అనునిత్యం వేదింపులకు దిగారు. ఒక మహిళగా, కుటుంబ బాధ్యత మోసేదానిగా నా వాళ్ల కోసమైనా బతకాలనుకున్నాను కానీ, నాకు సహాయం చేసేవాళ్లు లేరు. ఇకపై పోరాడే శక్తి కూడా లేదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను..''అని విజయలక్ష్మి సూసైడల్ వీడియోలో చెప్పారు.
కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..
ఎన్టీకే సీమన్.. పీపీకే నాడార్..
ఆత్మహత్యాయత్నానికి ముందు విజయలక్ష్మి చేసిన వీడియోలో ఇద్దరు ప్రముఖుల పేర్లను పదే పదే ప్రస్తావించారు. అందులో ఒకరు ‘‘నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) అధినేత, మాజీ నటుడు సీమాన్ కాగా, రెండో వ్యక్తి ‘‘పనన్కట్టు పడై కట్చి(పీపీకే)''కి చెందిన హరి నాడార్. ఏది ఏమైనా అన్ని రంగాల్లో, అన్నింటా తమిళులకే అధిక ప్రాధాన్యం ఉండాలన్నది ఆ రెండు పార్టీల ప్రధాన ఉద్దేశం. ఆ దిశగానే వారి కార్యక్రమాలు సాగుతుంటాయి. ఈ క్రమంలో.. కొన్నాళ్ల కిందట నటి విజయలక్ష్మి ఆ పార్టీల అభిప్రాయాలతో విభేదించారు. ఆ తర్వాతి నుంచి సీమన్, నాడార్, వారి అనుచరులకు, పార్టీల కార్యకర్తలకు విజయలక్ష్మి టార్గెట్ అయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలదాడి కొనసాగుతున్నది.
కన్నడిగ కావడం వల్లేనా?
విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులకు భాషా దురభిమానమే కారణమనే వాదన వినిపిస్తోంది. చివరి వీడియోలో తాను కన్నడిగనే అని నటి స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఇది చూస్తున్న అందరికీ నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పుట్టింది కర్ణాటకలోనే. కేవలం ఆ కారణంగానే సీమన్ నన్ను టార్గెట్ చేశాడు. అతణ్ని, హరి నాడార్ ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలి''అని నటి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో, బయటా వేధింపుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ విజయలక్ష్మి చేసిన ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
సీమన్ అనుచరులు దాడి చేస్తారేమో..
ప్రస్తుతం విజయలక్ష్మి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెను పరామర్శించానని మరో నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘విజయలక్ష్మి బాగా బెదిరిపోయింది. వేధింపుల విషయంలో ఏం చేయాలో అర్థంకాకే తానిలా ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను ఎక్కడుందీ తెలిస్తే సీమన్, నాడార్ మనుషులొచ్చి దాడి చేస్తారేమోనని భయపడుతోంది. సమాజం నుంచిగానీ ప్రభుత్వం నుంచిగానీ భరోసా కల్పిస్తే బయటికొచ్చి ఈ వివాదం గురించి మాట్లాడుతానని నాకు చెప్పింది'' అని గాయత్రి రఘురామ్ అన్నారు. నటి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో పార్టీల పేర్లు కూడా ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ కలకలం రేపుతున్నది.