జయలలితను అవమానిస్తూ పాట: ఫోక్ సింగర్ అరెస్ట్
చెన్నై: తమిళనాడు ప్రముఖ జానపద గాయకుడు కోవాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత పైన అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటలు రాసి పాడారని ఆరోపిస్తూ అతనిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత రాత్రి 2 గంటల సమయంలో తిరుచ్చి సమీపంలోని మార్తాండ కురుచ్చిలోని ఆయన నివాసం పైన దాడి చేసిన పోలీసులు 45 ఏళ్ల కోవన్ అలియాస్ ఎస్ సదాశివ్ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం చెన్నైకి తరలించారు.
ఇతను రాష్ట్రంలో విప్లవ కార్యక్రమాలు చేస్తున్న మక్కల్ కాలై ఇలక్కియా కళగం వర్గానికి చెందనవాడని పోలీసులు తెలిపారు. కోవన్ పాడిన ఓ పాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అందులో సిఎం పైన అనుచిత వ్యాఖ్యలున్నాయన్న కారణంతో ఐపీసీ సెక్షన్ 124 (ఏ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
పోలీసుల అదుపులో ఉన్న కోవన్ను తాను కలుసుకునేందుకు యత్నించగా పోలీసులు అనుమతించ లేదని న్యాయవాది జిమ్ రాజ్ మిల్టన్ ఆరోపించారు. తాను శుక్రవారం ఉదయం మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశానన్నారు.