కావేరి బోర్డు కోసం ఫైట్ చేస్తుంటే.. రథయాత్రలా?: కామ్రేడ్ కోవన్ అరెస్ట్
తిరుచిరాపల్లి: వామపక్ష వాగ్గేయకారుడు, కామ్రేడ్ కోవన్ను తిరుచురాపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కావేరీ బోర్డు వివాదంలో ప్రధాని మోడీ, తమిళనాడు ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన పాడిన పాటపై కేసు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది.
వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా, ప్రజలను రెచ్చగొట్టే రీతిలో పాటలు పాడుతున్నాడని బీజేపీ నేతలు కోవన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టు జరగ్గా.. కోర్టు బెయిల్ పై ఆయన విడుదల కూడా అయినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
కోవన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, హైడ్రామా చోటు చేసుకున్నాయి. బంధువులు, స్నేహితులు, మద్దతుదారులు ఆయన అరెస్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు వాహనాలకు అడ్డంగా బైఠాయించి కోవన్ అరెస్టును అడ్డుకున్నారు. పోలీసులు వారందరిని పక్కకు తప్పించి కోవన్ను అక్కడి నుంచి తరలించారు.
కాగా, కోర్టు బెయిల్పై విడుదలయ్యాక.. కోవన్ మీడియాతో మాట్లాడారు. 'రామ రాజ్య రథయాత్రకు వ్యతిరేకంగా నేను పాట పాడాను. ఓవైపు మేము కావేరీ బోర్డు కోసం పోరాడుతుంటే.. మరోవైపు రథయాత్రల పేరుతో రాష్ట్రంలో అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది' కోవన్ ఆరోపించారు.
వివాదం రేపిన ఈ పాటను గత మార్చిలో తిరుచురాపల్లిలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో కోవన్ పాడారు. ఆ పాట యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది. కాగా, కోవన్ 'మక్కల్ కలై ఇలక్కియ కజగం' తరుపున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గతంలో మద్యపాన నిషేధంపై కూడా ఆయన ఉద్యమించారు.
ఇదిలా ఉంటే, కోవన్ పై గతంలోనూ పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం జయలలితపై అభ్యంతరకర పాటలు రాసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినందుకు అప్పట్లో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.