Save Tamil Nadu: తమిళనాడులో వైఎస్ జగన్ పోస్టర్లు: హీరో విజయ్, ప్రశాంత్ కిశోర్లతో..!
Recommended Video
చెన్నై: తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పోస్టర్లు విస్తృతంగా వెలిశాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తమిళనాడు టాప్ హీరో విజయ్లతో కలిపి వైఎస్ జగన్ ఉన్న పోస్టర్లు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. హీరో విజయ్ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు. సేవ్ తమిళనాడు పేరుతో ఆ పోస్టర్లు, బ్యానర్లను ముద్రించారు. విజయ్ను రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి ఉద్దేశించిన బ్యానర్లు అవి.
కేజ్రీవాల్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్: గ్రాండ్గా..: కనీసం 50 వేల మంది: కనివినీ ఎరుగని భద్రత..!
ప్రశాంత్ కిశోర్ సహకారంతో..
ప్రత్యేకించి- మధురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ బ్యానర్లు వెలిశాయి. `మేము మా రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇక మీరు మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి..` అని వైఎస్ జగన్, ప్రశాంత్ కిశోర్ సంయుక్తంగా విజయ్ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్న అక్షరాలను ఆ పోస్టర్ల మీద ముద్రించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నిన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిశోర్ చాణక్యం పని చేసిందని అంటున్నారు.
ఐటీ దాడుల అనంతరం విస్తృతం..
హీరో విజయ్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. విజయ్తో పాటు ఆయన నటించిన బిగిల్ సినిమాకు ఫైనాన్షియర్గా వ్యవహరించిన అన్బు చెళియన్ ఇళ్లు, కార్యాలయాలపైనా ఆదాయపు పన్ను అధికారులు విస్తృతంగా సోదాలను నిర్వహించారు. లెక్క చూపని 77 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వారిద్దరికీ సమన్లను జారీ చేశారు. ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతోంది.
అధికార పార్టీ ప్రోత్సాహంతోనే..
ఈ ఐటీ దాడులకు సంబంధించిన ప్రకంపనలు అటు తమిళనాడులో, ఇటు కోలీవుడ్లో దుమారాన్ని రేపింది. రాజకీయంగా విజయ్ను టార్గెట్గా చేసుకున్నారని చెబుతున్నారు ఆయన అభిమానులు. ఉద్దేశపూరకంగానే దాడులను కొనసాగించారని, దీని వెనుక అన్నా డీఎంకే ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విమర్శిస్తున్నారు. బీజేపీతో చేతులు కలిపిన అన్నా డీఎంకే నాయకులు.. రాజకీయంగా తమ హీరోను అణగదొక్కడానికే ఈ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు.
రాజకీయాల్లోకి రావాలంటూ..
ఈ పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు పట్టుబడుతున్నారు. వైఎస్ జగన్ను ఆదర్శంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వైఎస్ జగన్, విజయ్ వంటి యువతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. విజయ్ నటిస్తోన్న తాజా సినిమా మాస్టర్ షూటింగ్ కడలూర్ జిల్లా నైవేలిలో కొనసాగుతుండగా.. వందలాది మంది అభిమానులు షూటింగ్ స్పాట్కు వెళ్లి మరీ ఆయనకు నైతిక మద్దతు ఇచ్చారు.