Tamil Nadu Assembly Elections 2021: అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు..ఎవరికెన్ని..?
చెన్నై: తమిళనాడులో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అధికార పక్షం విపక్షాలు పొత్తులపై సమాలోచనలు చేస్తున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే - బీజేపీల మధ్య పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీకి 20 అసెంబ్లీ స్థానాలతో పాటు కన్యాకుమారి లోక్సభ స్థానంను ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకారం తెలిపింది. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను అన్నాడీఎంకే శుక్రవారం విడుదల చేసింది. బీజేపీతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం శుక్రవారం రాత్రి సీట్ల పరంగా ఇరుపార్టీల మధ్య ఒక అవగాహన కుదిరింది.
ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఉంటుందని పార్టీ ప్రకటించింది. ఆ మేరకు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మరియు తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురుగన్ల మధ్య ఒప్పందం జరిగింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 170 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుండగా.. పశ్చిమ తమిళనాడు బెల్ట్లో బీజేపీ ఫోకస్ పెట్టింది. బీజేపీ అక్కడి నుంచి పోటీ చేయనుంది. పశ్చిమ తమిళనాడు ప్రాంతంలో అన్నాడీఎంకేకు గట్టి పట్టుంది. అక్కడ బీజేపీ పోటీ చేస్తే తప్పకుండా అన్నాడీఎంకే ప్రభావం ఉంటుందని తద్వారా లబ్ది పొందొచ్చని భావిస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం రోజున అన్నాడీఎంకే ఆరుగురు అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను విడుదల చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అతని సొంత జిల్లా సేలంలోని ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా... డిప్యూటీ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ఆయన సొంత ఊరైనా బొడినాయకనూర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇది తేనీ జిల్లాలో ఉంది. ఇక మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ రోయపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా... న్యాయశాఖ మంత్రి షన్ముగం విల్లుపురం నుంచి పోటీ చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎస్పీ షన్ముగనాథన్ శ్రీవాయిగుండం నియోజకవర్గం నుంచి బరిలో దిగనుండగా... మరో ఎమ్మెల్యే తేన్మొళి నీలకొట్టాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.