నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోడీ నామినెట్: తమిళసై, 50 కోట్ల మంది, ప్రపంచంలో!
చెన్నై: భారత ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ప్రజలతో పాటు ప్రతిపక్షాలు అందుకు మద్దతు ఇవ్వాలని బీజేపీ శాఖ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎవ్వరూ ప్రవేశపెట్టని ఆయుష్మాన్ భారత్ రికార్డు సృష్టిస్తుందని, అందుకు ప్రధాని మోడీకి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని తమిళసై సౌందరాజన్ అంటున్నారు.
దేశంలోని పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం చేపట్టారని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ గుర్తు చేశారు. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందించడమే ప్రధాని మోడీ లక్షం అని ఆమె గుర్తు చేశారు.
దేశంలోని పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 24వ తేదీ సోమవారం రాంచీలో ఆయుష్మాన్ భారత్ ను అట్టహాసంగా ప్రారంభించారని తమిళసై సౌందరరాజన్ గుర్తు చేశారు.
ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అని, అందుకే దీనిని మోడీ కేర్ అంటూ పాలకపక్షం అభివర్ణిస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద పథకాన్ని పేద ప్రజల చికిత్స కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని ఆమె అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశ వ్యాప్తంగా 13,000 ఆసుపత్రులు పని చేస్తాయని తమిళసై సౌందరరాజన్ గుర్తు చేశారు.
పేద ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సేవలు గుర్తించి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తాను ఆయన పేరును నామినెట్ చేశామని, ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలు అందుకు మద్దతు ఇవ్వాలని తమిళసౌ సౌందరరాజన్ మనవి చేశారు.
ప్రముఖ ప్రైవేట్ యూనివర్శిటీలో నెఫ్రాలజీ విభాగం చీఫ్, సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న తన భర్త డాక్టర్ పి. సౌందరరాజన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పేరును నోబెల్ కు నామినెట్ చేశారని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ వివరించారు. 2019 జనవరి 31వ తేదీలోపు నోబెల్ శాంతి బహుమతి కోసం నరేంద్ర మోడీ పేరు నామినెట్ చెయ్యవలని ఉంది.