ఒవియాపై పోలీసులకు ఫిర్యాదు: మోడీకి వ్యతిరేకంగా ట్వీట్, కుట్ర కోణమంటూ బీజేపీ ఫైర్
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడల్, సినీ నటి ఒవియా హెలెన్ తమిళనాడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని, అరెస్ట్ డిమాండ్ చేస్తున్నారు.
ఒవియాపై పోలీసులకు ఫిర్యాదు
అంతేగాక, ఒవియాపై బీజేపీ లీగల్ వింగ్ సభ్యుడు, న్యాయవాది అలెక్స్ సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ. 3770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్పేట-విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ. 293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్-అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్, రూ. 423 కోట్లతో విద్యుద్ధీకరించిన విల్లుపురం-తంజావూరు-తిరువారూర్ మార్గంలో రైలు సేవలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళ రైతులను ఆయన ప్రశంసించారు.
మోడీ గో బ్యాక్ అంటూ ఒవియా ట్వీట్..
కాగా, ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ నటి ఒవియా హెలెన్ సోషల్ మీడియాలో 'గో బ్యాక్ మోడీ' అనే హ్యాష్ ట్యాగ్తో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. ఆమె తీరుపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశద్రోహం, ఐటీ చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని అలెక్స్ సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒవియా ట్వీట్.. కుట్ర కోణం ఉందంటూ ఆరోపణ
కేరళకు చెందిన మోడల్ అయిన ఒవియా తమిళ బిగ్బాస్-1లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కూడా లభించింది. తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో హీరో తరుణ్తో ఓ సినిమా చేశారు. అయితే, ఒవియా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేయడం గమనార్హం. ఒవియా తాజా ట్వీట్పై లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులను బీజేపీ కోరింది. ఆమె ట్వీట్ల వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కూడా తెలుస్తోందన్నారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.