లగ్జరీ కారులో పారిశ్రామిక వేత్త సజీవదహనం, లేడీతో వల, కిడ్నాప్, భాగస్వామి కిరాతకం !
చెన్నై: తమిళనాడులోని సమయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో లగ్జరీ కారుతో సహ పారిశ్రామిక వేత్తను సజీవదహనం చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పారిశ్రామిక వేత్తను హత్య చెయ్యడానికి ఓ కిలాడీ లేడీ సహాయం తీసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందమైన అమ్మాయిని ఎర వేసిన తరువాత పారిశ్రామిక వేత్తను అతని వ్యాపార భాగస్వామి దారుణంగా హత్య చేయించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!
కారు బూడిద
తిరుచ్చి జిల్లా సమయపురం సమీపంలోని సిరుగనేర్ మెయిన్ రోడ్డు నుంచి లాల్ కుడి వెళ్లే మార్గంలో వచ్చన్ కురిచ్చి దగ్గర దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతం సమీపంలో కారు పూర్తిగా బూడిద అయిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
లగ్జరీ కారులో శవం
బూడిద అయిన కారు చాల విలాసవంతమై వాహనం అని పోలీసులు గుర్తించారు. కారులో ఓ మృతదేహం ఉన్న విషయం పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి పోలీసులు కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. కారు తిరుచ్చి జిల్లా కాటూర్ ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్త జాకీర్ హుసేన్ (51) అనే వ్యక్తిది అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
కొడుకు విచారణ
పోలీసులు జాకీర్ హుసేన్ ఇంటికి వెళ్లి అతని కుమారుడు అన్సార్ హుసేన్ (23)ను పిలుచుకుని కారు బూడిద అయిన ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేశారు. కారులో బూడిద అయిన వ్యక్తి తన తండ్రి జాకీర్ హుసేన్ అని అన్సార్ హుసేన్ నిర్దారించాడు. జాకీర్ హుసేన్ ను ఎవరు హత్య చేశారు ? అంటూ పోలీసులు ఆరా తీశారు.
చివరి ఫోన్ కాల్
కారులో బూడిద అయిన జాకీర్ హుసేన్ మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. జాకీర్ హుసేన్ మొబైల్ ఫోన్ కు చివరిగా పెరంబూరు జిల్లా సెట్టికులమ్ కున్నుమేడు ప్రాంతానికి చెందిన శరవణన్ (22) అనే యువకుడు ఫోన్ చేశాడని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తాను జాకీర్ హుసేన్ తో కలిసి వ్యాపారం చేస్తున్నానని పోలీసుల విచారణలో శరవణన్ అంగీకరించాడు.
లగ్జరీ కార్లు, రియల్ వ్యాపారం !
జాకీర్ హుసేన్, శరవణన్ కలిసి విలాసవంతమైన కార్లు (లగ్జరీ కార్లు) కొనుగోలు చేసి తరువాత వాటిని విక్రయిస్తున్నారు. కార్ల వ్యాపారంతో పాటు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని పోలీసుల విచారణలో శరవణన్ అంగీకరించాడు. తన దగ్గర జాకీర్ హుసేన్ అధిక మొత్తంలో నగదు తీసుకుని తరువాత తిరిగి ఇవ్వలేదని శరవణన్ పోలీసులకు చెప్పాడు. ఎంత అడిగినా డబ్బులు ఇవ్వకుండా జాకీర్ హుసేన్ తనను వేధింపులకు గురి చేశాడని, ఇద్దరి మద్య రెండుసార్లు గొడవ జరిగిందని, ఇంతకు ముందే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయ్యిందని శరవణన్ పోలీసులకు చెప్పాడు.
కిలాడీ లేడీతో వల
జాకీర్ హుసేన్ మీద కక్ష పెంచుకన్న శరవణన్ ఓ లేడీ సహాయంతో అతన్ని హత్య చెయ్యడానికి ప్లాన్ వేశాడు. ఈనెల 12వ తేదీన కిలాడీ లేడీని జాకీర్ హుసేన్ కు వలవేసి అతన్ని రామనత్తమ్ లోని ఓ లాడ్జ్ లోకి తీసుకెళ్లారు. అక్కడే కిలాడీ లేడీతో ఎంజాయ్ చేస్తున్న జాకీర్ హుసేన్ మీద దాడి చేసిన శరవణన్, అతని స్నేహితులు తరువాత అతన్ని కిడ్నాప్ చేశారు. తరువాత జాకీర్ హుసేన్ ను అతని లగ్జరీ కారులో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశామని శరవణన్ అంగీకరించాడు. జాకీర్ హుసేన్ హత్య కేసులో శరవణన్ తో పాటు అతని స్నేహితులు మణికంఠన్, మోహన్, శక్తివేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. జాకీర్ హుసేన్ హత్యకు సహకరించిన కిలాడీ లేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.