సీటు బెల్ట్ లేదని చితకబాదిన పోలీసులు: నిప్పంటించుకున్న డ్రైవర్ మృతి!
చెన్నై: సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఓ కారు డ్రైవర్ మీద ట్రాఫిక్ పోలీసులు చెయ్యి చేసుకోవడంతో అతను ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగర శివార్లలో జరిగింది. ఆత్మహత్యాయత్నం డ్రైవర్ మనికందన్ (21) చికిత్స విఫలమై శుక్రవారం ఆసుపత్రిలో మరణించాడు.
చెన్నై ట్రాఫిక్ పోలీసులు
బుధవారం మద్యాహ్నం చెన్నై నగర శివార్లలోని పాత మహాబలిపురం రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు పరిశీలిస్తున్నారు. ఆ సందర్బంలో మనిందన్ (21) అనే వ్యక్తి కారులో అటువైపు వెళ్లారు. కారు నిలిపిన ట్రాఫిక్ పోలీసులు సీటు బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు.
అతి చేసిన పోలీసులు
కారు డ్రైవర్ మనికందన్ ఎదో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. ఏం తమాషా చేస్తున్నావా ? అంటూ కారు డోర్ తీసి డ్రైవర్ ను చితకబాది అపరాదరుసుం చెల్లించాలని దురుసుగా ప్రవర్తించారు.
నిప్పంటించున్న డ్రైవర్
సీటు బెల్ట్ పెట్టుకోలేదని అందరి ముందు తన మీద పోలీసులు దాడి చేశారని ఆవేదనతో డ్రైవర్ మనిందన్ కారు డిక్కిలో ఉన్న పెట్రోల్ తీసుకుని మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు మంటలు అదుపు చేసి అతన్ని కీలపాకు ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై
నిమిషాలతో ఈ తతంగం జరిగిపోవడంతో భయంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి పరుగు తీశారు. స్థానికులు గుమికూడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. అయితే పోలీసుల మీద ఫిర్యాదు చేసిన మనిందన్ చికిత్స విఫలమై మరణించాడు.