దటీజ్ అమ్మ: జయ ధీర జర్నీ ఇదే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సోమవారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. జయలలిత చికిత్స విఫలమై మరణించాని సోమవారం అర్దరాత్రి 12.10 గంటలకు అపోలో, అన్నాడీఎంకే వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం తమిళనాడులో విషాదచాయలు నెలకొన్నాయి.
జయలలిత 1948 ఫిబ్రవరి 24వ తేదీన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని పాండవపుర తాలుకాలోని మేలుకోటేలో జన్మించారు. అక్కడి నుంచి అంచలంచెలుగా పైకి వచ్చి నేడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
నిత్యం పేద ప్రజల కోసం పరితపించే జయలలిత చివరికి ముఖ్యమంత్రి హోదాలోనే అనారోగ్యానికి గురై పరలోకాలకు వెళ్లిపోయారు. అమ్మలేని జీవితం మేము ఊహించుకోలేమని తమిళనాడు ప్రజలు బోరున విలపిస్తున్నారు.
అన్నాడీఎంకే నాయకులు సైతం అమ్మ ఫోటోలు చేతపట్టుకుని విషాదంలో మునిగిపోయారు. ఇక మాకు ఎవరు దిక్కు అమ్మా అంటూ బిక్కుబిక్కున ఏడుస్తున్నారు. తమిళనాడుతో పాటు దేశం మొత్తం ఉన్న జయలలిత అభిమానులు మంగళవారం శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.
అమ్మ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు తమిళనాడులోని వివిద జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు, హోడ్డింగ్స్ ధ్వంసం చేశారు. జయలలిత అభిమానులు సహనం కోల్పోయి ఆందోళనలు చెయ్యడంతో పోలీసులు హడలిపోతున్నారు. పరిస్థితిని అదుపు చెయ్యడానికి పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.
మైసూరులో జన్మించారు
1948 ఫిబ్రవరి 24వ తేదిన మైసూరులో తమిళ అయ్యాంగార్ సంతతికి చెందిన జయరామన్, అలనాటి నటి సంధ్య దంపతులకు జయలలిత జన్మించారు.
అప్పుడే కష్టాలు
జయలలితకు రెండు ఏళ్లు ఉన్న సమయంలో ఆమె తండ్రి జయరామన్ మరణించారు. తరువాత తల్లితో కలిసి తమిళనాడులోని సొంత ప్రాంతానికి చేరుకున్నారు.
స్కూల్ టాపర్
మద్రాసు (చెన్నై) లోని చర్చి పార్క్ స్కూల్ లో టాపర్ గా నిలిచారు. అయితే తల్లి బాటలోనే సినీరంగంలో అడుగు పెట్టాలని జయలలిత నిర్ణయించుకున్నారు.
సినీ రంగ ప్రవేశం
భరతనాట్యం, మోహినీ అట్టం, కథక్, మణిపురి తదితర నాట్యాలలో జయలలిత ప్రావీణ్యం సంపాధించింది. వెన్ని రాడై చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.
బహుబాషా నటిగా గుర్తింపు
తమిళ, తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో జయలలిత నటించారు. ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించిన రికార్డు జయలలిత సొంతం అయ్యింది.
గాయకురాలిగా, అమ్మా అనే పాట పాడి
తమిళ సినీ పరిశ్రమలో నటిగా ఉంటూనే గాయనిగా మారారు. అడిమైపెన్ చిత్రంలో అమ్మా ఎండ్రాల్ అనే చరణంతో మొదటి సారి పాట పాడారు. నేడు తమిళనాడులో అమ్మా అంటూ అందరి చేత పిలిపించుకుంటున్నారు.
రాజకీయాలలోకి వచ్చారు
కరుణానిధిపై వ్యతిరేకత కారణగా ఎంజీఆర్(ఎంజీ రామచంద్రన్) వేరుకుంపటి పెట్టారు. ఆ సమయంలో జయలలిత ఎంజీఆర్ తో కలిసి రాజకీయాల్లో పాలు పంచుకోవాలని ఆసక్తి చూపించారు.
రాజ్యసభ సభ్యురాలిగా
1981లో అన్నా డీఎంకే లో అడుగు పెట్టిన జయలలిత పార్టీ కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. తన వాక్చాతుర్యంతో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పని చేశారు. 1984లో ఆమెను రాజ్యసభకు పంపించారు.
ఇందిరాగాంధీని ఆశ్చర్యపరిచారు
తన వాక్చాతుర్యంతో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని సైతం ఆశ్చర్య పరిచి ఆకట్టుకున్నారు. అయితే ఎంజీఆర్ ఆకస్మిక మరణం తరువాత జయలలితకు రాజకీయంగా కష్టాలు ఎదురైనాయి.
దేశంలో తొలి మహిళా ప్రతిపక్ష నేత
ఎంజీ రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ సీఎం రేసులోకి వచ్చారు. ప్రభుత్వంలో అన్ని రకాలుగా విఫలం కావడంతో జయలలితకు కలిసి వచ్చింది. తరువాత జరిగిన ఎన్నికల్లో జయలలితతో పాటు కొందరు మాత్రం శాసన సభ్యులుగా ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ జీవితం మలుపుతిప్పింది.
1991లో ముఖ్యమంత్రిగా
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జయలలిత ప్రజల పక్షాన పలు పోరాటాలు చేశారు. 1991లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆమె తొలి సారి ముఖ్యమంత్రి అయ్యారు.
రెండు సార్లు సీఎం పదవి పోయింది
అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్న జయలలిత రెండు సార్లు సీఎం పదవి నుంచి తప్పుకుని జైలుకు వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడు కురుణానిధితో పాటు డీఎంకే మాజీ మంత్రులను అరెస్టు చేయించి జైలులో పెట్టించారు.
ప్రజలే సర్వస్వం
అనేక వివాదాలు చుట్టుముట్టినా జయలలిత ఎన్నడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. ప్రజలే తన కుటుంబ సభ్యులని పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ స్థాయిలో జయలలిత ఉన్నారంటే అందుకు తమిళ ప్రజల అండ పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు.