జయలలిత కోటలో పాగకు ‘నెచ్చలి శశికళ’ పావులు !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళ నటరాజన్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జయలలిత అనారోగ్యాన్ని ఆమె అవకాశంగా తీసుకునే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తమిళనాడులో రానున్న శాసన సభ ఉప ఎన్నికల్లో శశికళ పోటీ చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. జయలలిత తరువాత అన్నాడీఎంకేలో సంచలన నిర్ణయాలు తీసుకునే సత్తా ఒక్క శశికళకు మాత్రమే ఉంది.
ఒకవేళ శశికళ పోటీ చెయ్యకుంటే తన అనుచరులకు అవకాశం కల్పించడానికి పావులు కదుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జయలలిత వ్యక్తిగత జీవితంలో ఎంతో కీలకపాత్ర పోషించే శశికళ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
అయితే శశికళకు రాజకీయంగా మంచిపలుకుబడి ఉంది. సమాజిక పరంగా బలమైన దేవర్ కులానికి చెందిన శశికళకు అన్నాడీఎంకే పార్టీలో అనుచరులు చాలమంది ఉన్నారు. దేవర్ కులానికి చెందిన అన్నాడీఎంకే శాసన సభ్యుల సంపూర్ణ మద్దతు శశికళకు ఉంది.
అన్నాడీఎంకే పార్టీలో నెంబర్ టూ అయిన తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరు సెల్వం సైతం దేవర్ కులానికి చెందిన వారే. అటు అమ్మకు, ఇటు చిన్నమ్మ శశికళకు పన్నీరు సెల్వం విశ్వాసపాత్రుడు.
గత శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని శశికళ ప్రయత్నించారు. అయితే ఆమెకు అవకాశం రాలేదు. కానీ ఆమె అనుచురులు మాత్రం చాల మంది శాసన సభ్యులు అయ్యారు.
ఇప్పుడు శశికళకు మంచి అవకాశం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండటంతో ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో శశికళ నిర్ణయమే చెల్లుతుందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
విచ్చలవిడిగా నగదు పంపిణి చేశారని ఆరోపణలు రావడంతో కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజక వర్గాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మదురై జిల్లా తిరుపరగుడ్రం శాసన సభ్యుడు (అన్నాడీఎంకే) శీనివేల్ అనారోగ్యంతో మరణించడంతో ఆ నియోజక వర్గం ఖాళీ అయ్యింది.
ఈనెల చివరిలో ఉప ఎన్నికల తేది వెలువడే అవకాశం ఉంది. అన్నాడీఎంకే పార్టీలో అభ్యర్థుల ఎంపికలో జయలలిత తరువాత ఆమె స్థానంలో నిర్ణయం తీసుకునే ధైర్యం శశికళకు తప్పా వేరేవారికి లేదు.
దీంతో మూడు నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ? అనే నిర్ణయాన్నిశశికళ తీసుకుంటారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. ఎదో ఒక నియోజక వర్గం నుంచి శశికళ పోటీ చేసే అవకాశం ఉందని నాయకులు అంటున్నారు.
గతంలో ఆయా నియోజక వర్గాల అభ్యర్థులు కొనసాగుతారా అనే అనుమానాలు ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తరువాత బెయిల్ మీద వీరు బయటకు వచ్చారు.