పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని పలు కీలక సమస్యలపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యవహరిస్తున్న శైలి పలువురి మన్ననలు అందుకుంటోంది. ఇతరులను నొప్పింపకుండా పన్నీర్ సెల్వం తన పనితాను పూర్తి చేసుకుని ముందుకు వెలుతున్నారు.
జయలలిత మరణించిన తరువాత అందరూ ఊహించినట్లే పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. అయితే ఆయన పనితీరు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో పన్నీర్ సెల్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వర్ధ తుపానుతో చెన్నై నగరంతో సహ తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకటనలకే పరిమితం కాకుండా ఆయన బాధిత ప్రాంతాలకు నేరుగా వెళ్లి పరిశీలించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆ సమయంలో రాజకీయ విశ్లేషకులు సైతం పన్నీర్ సెల్వంపై ప్రశంసలు కురిపించారు. సాగునీటి ఎద్దడితో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కొందరు గుండెపోటుతో మరణించడంతో రైతులు, రాజకీయ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
తమిళనాడును కరువు రాష్ట్రంగా ప్రకటించారు. మాకు సాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా కలిసి మెమొరాండం సమర్పించారు. ప్రభుత్వంపై రైతులకు కొత్త భరోసా కల్పించారు.
సరైన వర్షాలు కురువక తాగునీటి ఎద్దడితో చెన్నై నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్-తమిళనాడు మధ్య ఒప్పందం ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతిలో నేరుగా కలుసుకున్నారు.
కృష్ణా జలాలు అదనంగా పొందడంలో విజయం సాధించి తనదైన చాణక్యతను పన్నీర్ సెల్వం ప్రదర్శించారు. జల్లికట్టు ఆందోళనలు రాష్ట్రంలో ఎక్కువ అయిన సమయంలో సంయమనం, సమయస్పూర్తితో వ్యవహరించారు.
మెరీనా తీరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో నిరసనకారుల మనోభావాలకు ప్రధాన్యత ఇచ్చారు. రాత్రికిరాత్రే ఢిల్లీ వెళ్లి మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోడీని భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సూచనమేరకు మరసటి రోజు ఢిల్లీలోనే ఉండి జల్లికట్టు నిషేధం ఎత్తివేతకు ఆర్డినెన్స్ జారీ చేయించారు.
శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో ముసాయిదా బిల్లును తీసుకొచ్చి జల్లికట్టు మద్దతుదారుల నుంచి మార్కులు కొట్టేశారు. జల్లికట్టు మద్దతుదారులు సీఎం పన్నీర్ సెల్వంకు విమర్శిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
అయితే అలాంటి విషయాలను పన్నీర్ సెల్వం పట్టించుకోలేదు. ఈ విషయం గురించి శాసనసభలో ప్రకటించే సమయంలో పన్నీర్ సెల్వం మోములో చిరునవ్వు కనిపించింది. జల్లికట్టుపై నిషేధం తొలగించి ఆ కార్యక్రమం నిర్వహించడానికి స్వయంగా ఆయన మధురైలోని అలంగానల్లూరుకు వెళ్లారు.
అయితే ఓ వర్గం వారు అడ్డుకోవడంతో పన్నీర్ సెల్వం చిరునవ్వుతో అక్కడి నుంచి వెనుతిరిగారు. అంతే కాని హోం శాఖ తన దగ్గర ఉందని ఆయన అధికార దుర్వినియోగం చెయ్యడానికి ప్రయత్నించలేదు.
మీరు సీఎంగా ఉన్నారు కదా ? ఎందుకు వెనక్కి వెళ్లిపోతున్నారు అని మీడియా ప్రశ్నించగా ప్రజా జీవితంలో ఇలాంటివి సహజమే కదా అంటు పన్నీర్ సెల్వం తన హుందాతనాన్ని చాటుకున్నారు.
ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద మాట వరుసకు కూడా ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్లలేదు. ఆయన పనితీరుపై సామాజిక మాధ్యమాల్లో అభినందిస్తూ పోస్టులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అయ్యింది. ధటీజ్ పన్నీర్ సెల్వం అంటూ ప్రతిపక్షాల దగ్గర ఆయన మంచి మార్కులు కొట్టేస్తున్నారు.