జాతీయ విపత్తుగా ప్రకటించండి: మోడీకి జయ లేఖ
చెన్నై: తమిళనాడులో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
100 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెన్నై మహానగరం మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని ప్రాంతాలు రోజుల పాటు వరద నీటిలో చిక్కుకుపోయాయి.
ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు మూతపడని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం సైతం రాకపోకలను నిలిపివేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇలా ఒక్కటేమీ యావత్ చెన్నై నగరం మొత్తం వరదనీటిలో చిక్కుకుపోయింది. చెన్నైకి కొన్ని రోజుల పాటు రాకపోకలు సైతం నిలిచిపోయాయి.
ఈ సమయంలో ప్రధాని మోడీ చెన్నైలో ఏరియల్ సర్వే చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తమిళనాడుని ఆదుకుంటామన్నారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 250 మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు దొరకక చెన్నై వాసులు అలమటించారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో మరణించిన తమ కుటుంబ సభ్యుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేక కొన్ని కుటుంబాలు రోజుల తరబడి శవాల ముందే జాగారం చేస్తున్నారు.
2011 నాటి గణాంకాల ప్రకారం చెన్నై నగరం, శివారు ప్రాంతాలను కలుపుకుంటే 8,653,521 జనాభా ఉంది. వీరిలో 4,358,612 పురుషులు కాగా 4,294,909 మంది స్త్రీలు ఉన్నారు. ఈ జనాభా అవసరాల కోసం ప్రైవేటు, ప్రభుత్వాలకు సంబంధించి 38 సాధారణ శ్మశానవాటికలు ఉన్నాయి.
ఇవిగాక 22 బయోగ్యాస్ శ్మశానాలు, 8 విద్యుత్ శ్మశానవాటికలు ఉన్నాయి. వరదల కారణంగా మృతి చెందిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు విధిలేక కులమత సంప్రదాయాలను పక్కనపెట్టి బయోగ్యాస్, విద్యుత్ శ్మశానవాటికలపైనే అందరూ ఆధారపడుతున్నారు.
దీంతో ఐదు శవాలకు అంత్యక్రియలు నిర్వహించే ఈ శ్మశానవాటికల్లో 15 మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మరికొందరు నగరంలోకి కొట్టుకొస్తున్న గుర్తుతెలియని శవాలను తమవిగా చెప్పుకొని ప్రభుత్వం నుండి పరిహారం పొందుతున్నారు.
ఇందుకు కారణం లేకపోలేదు మృతుని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.4లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెల్లిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా సర్వం కోల్పోయిన వారికి ఈ పరిహారం కాస్తంత ఊరట లభిస్తుందనే, ఈ విధంగా కొంతమంది సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.