ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భేటీ: కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన స్టాలిన్.. మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
భేటీ అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు, నీట్ రద్దు, నూతన విద్యా విధానం, సేతు సముద్రం ప్రాజెక్టు పునరుద్ధరణ, వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలపై మోడీతో చర్చించినట్లు స్టాలిన్ తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి తన సహకారం, సహాయం ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని స్టాలిన్ చెప్పారు. తమిళనాడుకు సంబంధించిన సమస్యల గురించి చర్చించేందుకు తనను ఎప్పుడైనా కలవవచ్చని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు స్టాలిన్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తుందని ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించడంపై స్టాలిన్ స్వాగతించడంతోపాటు ప్రశంసించిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. డీఎంకే నేతృత్వంలోని కూటమికి 159 స్థానాల్లో విజయం సాధించగా, అన్నాడీఎకేం, పీఎంకే, బీజేపీకి కూటమికి 75 స్థానాల్లో గెలుపొందారు.