మోడీ మీద నమ్మకం ఉంది, సీఎం: ఇరకాటం, తమిళ ఎంపీలను రెచ్చగొట్టిన తంబిదురై!
చెన్నై: కావేరీ యాజమాన్య మండలి (కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు)ను కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటు చేస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం చెయ్యదని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
జయలలిత
కావేరీ ట్రైబ్యునల్ తీర్పును గెజిట్లో విడుదల చేయించేందుకు గతంలో అమ్మ జయలలిత ఎంతో కృషి చేశారని ఎడప్పాడి పళనిస్వామి గుర్తు చేశారు. ప్రస్తుతం అమ్మ జయలలిత మన మధ్య లేనందున కావేరీ యాజమాన్య మండలి ఏర్పాటు చేయించడానికి శక్తి వంచనలేకుండా తమ వంతు కృషి చేస్తున్నామని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశం
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటుకు సుప్రీంకోర్టు విధించిన గడువు త్వరలో పూర్తి కానుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన గడుపు పూర్తి కాకముందే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తున్నామని ఎడప్పాడి పళనిస్వామి వివరించారు.
ప్రధానితో అన్నాడీఎంకే
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి చర్చించారని ఎడప్పాడి పళనిస్వామి వివరించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును మార్చి 29వ తేదీలోపు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే అన్నాడీఎంకే ఎంపీలకు హామీ ఇచ్చిందని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
చక్రం తిప్పిన తంబిదురై
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న సమయంలోనే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మీరు ఆందోళన చెయ్యాలని అన్నాడీఎంకే పార్టీ ఎంపీలను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై రెచ్చగొట్టి గందరగోళానికి తెరలేపారని తెలిసింది.
అయోమయంలో బీజేపీ
కర్ణాటకలో శాసన సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడాన్ని కన్నడిగులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్బంలో కర్ణాటకలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.