పార్క్ లో జంట అడుగుపెట్టాలంటే అది చూపించాలి: లేదంటే, బిజినెస్ చేస్తున్నారా?
కోయంబత్తూరు: పార్క్ లో పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ పార్క్ నిర్వహకుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్క్ లోకి ప్రవేశించాలంటే వారు తప్పనిసరిగా వివాహ ధృవీకరణ పత్రం చూపించాలని నియమ నిబంధనలు పెట్టారు. అయితే పార్క్ నిర్వహకులు తీసుకున్న నిర్ణయాన్ని స్థానికంగా నివాసం ఉంటున్న వారు వ్యతిరేకిస్తు ఏం బిజినెస్ చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
బొటానికల్ గార్డెన్స్
తమిళనాడులోని కోయంబత్తూర్ మరుధామలియా రోడ్డులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో జంటల వెకిలి చేష్టలు కొంతకాలంగా బాగా పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయ్యటంతో అధికారులు సంచలన నిర్ణయాన్ని తీసుకుని వాటిని అమలు చేస్తున్నారు.
ఆధార్, ఫోన్ నెంబర్లు
బొటానికల్ గార్డెన్స్ పార్క్కి వెళ్లే జంటలు తమ వెంట తప్పనినసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ చూపించకపోతే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తారు. తొలుత జంటల ఓటర్ ఐడీ, ఆధార్ తరహాలో గుర్తింపుకార్డులు, ఫోన్ నంబర్లను పరిశీలించాలని అక్కడి సిబ్బంది నిర్ణయించారు. అయితే చివరకు వివాహ ధృవీకరణ పత్రం అయితేనే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.
కాలేజ్ విద్యార్థులు
ఈ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే, అందుకోసం ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదని అంటున్నారు. పార్క్ను బిజినెస్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ నిర్ణయం అమలు అయిన తరువాత కాలేజ్ విద్యార్థుల తాకిడి బాగా తగ్గిపోయిందని పార్క్ లో పని చేస్తున్న సిబ్బంది అంటున్నారు.
రావాలంటే సిగ్గుగా ఉంది
అగ్రికల్చర్ యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్ లో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని కొందరు పెద్దలు పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు, కాలేజ్ విద్యార్థులు, ప్రేమికుల ముసుగులో పార్క్ లొని పొదల చాటులో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇక్కడికి రావాలంటే సిగ్గుగా ఉందని పలువురు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు.