ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం భేటీ, దినకరన్ కొత్త పార్టీ రోజు ఢిల్లీలో, చెక్!
Recommended Video
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ పర్యటన మొదలైయ్యింది. బుధవారం మద్యాహ్నం పన్నీర్ సెల్వం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం పలు కీలక విషయాలు చర్చించనున్నారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి.
దినకరన్ కొత్త పార్టీ
చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ తమిళనాడులో ఎలాగైనా ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చాలని సిద్దం అయ్యారు. ఇప్పటికే టీటీవీ దినకరన్ 18 మంది రెబల్ ఎమ్మెల్యేలను తయారు చేశాడు. కొత్త పార్టీ విషయం బుధవారం ప్రకటిస్తానని టీటీవీ దినకరన్ చెప్పారు.
కేసులతో తలనొప్పి
విదేశాల నుంచి అక్రమ నగదు లావాదేవీలు, ప్రభుత్వాన్ని మోసం చేశారని, భారత ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి సిద్దం అయ్యారని టీటీవీ దినకరన్ మీద కేసులు నమోదు అయ్యాయి.
దినకరన్ కు భయం లేదు
టీటీవీ దినకరన్ మీద ఎన్ని కేసులు నమోదు అయినా, ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినా ఆయన మాత్రం భయపడటం లేదు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తున్న టీటీవీ దినకరన్ మీడియాలో హాట్ టాఫిక్ అవుతున్నాడు.
దినకరన్ కు ఢిల్లీలో చెక్ !
టీటీవీ దినకరన్ దూకుడుకు ఢిల్లీలో చెక్ పెట్టాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. టీటీవీ దినకరన్ ను ఇలాగే వదిలేస్తే మొదటికే మోసం వస్తోందని అన్నాడీఎంకేకి చెందిన కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పన్నీర్ రాజకీయం !
ఎంజీఆర్ శతజయంతి వేడుకులు చెన్నై నగరంలో ఘనంగా నిర్వహించడానికి అన్నాడీఎంకే నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంజీఆర్ శతజయంతి వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి పన్నీర్ సెల్వం బుధవారం ఢిల్లీ వెళ్లారు.
పనిలో పనిగా !
ప్రధాని నరేంద్ర మోడీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో టీటీవీ దినకరన్ దూకుడుకు చెక్ పెట్టాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. ఢిల్లీలోని పెద్దలను ఎంజీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానించాలని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారు.