జయ ఆరోగ్యం: అప్రకటిత కర్ఫ్యూ, వెంటనే రండి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అమ్మ అభిమానులు తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుంచి అపోలో ఆసుపత్రి దగ్గరకు పరుగు తీశారు. చెన్నై నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మందికి పైగా అపోలో ఆసుపత్రి దగ్గరకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వేలాధి మంది పోలీసులు అపోలో ఆసుపత్రి దగ్గర భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో ఆసుపత్రి దగ్గర అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అమ్మ అభిమానులు శాంతియుతంగా ఉండాలని, ఆందోళన చెందరాదని పోలీసు అధికారులు మనవి చేస్తున్నారు.
అయితే పోలీసు అధికారుల మాటలను అమ్మ అభిమానులు పట్టించుకోవడం లేదు. అన్నాడీఎంకే నాయకులు కార్యకర్తల ముందుకు వచ్చి జయలలిత ఆరోగ్యం విషయంపై చెప్పడానికి భయపడుతున్నారు. అభిమానులు రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుందని అన్నాడీఎంకే నాయకులు భయపడ్డారు.
తమిళనాడులోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమీషనర్లు, అన్ని ర్యాంకుల అధికారులు కచ్చితంగా యూనిఫాం వేసుకుని వారివారి అధికారిక వాహనాల్లో సోమవారం ఉదయం 7గంటలకు చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదివారం అర్దరాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి.
సెలవులో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది వెంటనే విధులకు హాజరుకావాలని, వారం రోజుల పాటు ఎవ్వరూ సెలవులు పెట్టరాదని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం అర్దరాత్రి తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అన్ని శాఖలకు చెందిన అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.
అధికారులు చేస్తున్న హడావిడి చూసిన అమ్మ అభిమానులు మరింత ఆందోళనకు గురైనారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన రోజు అపోలో ఆసుపత్రి దగ్గర మొహరించిన పోలీసుల కంటే ఇప్పుడు పోలీసుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ అయ్యింది.