ఎన్నికల ఎఫెక్ట్ : తమిళనాడులో బిర్యానికి యమా గిరాకీ
ఎన్నికలంటే ఎంత హంగామా.. జాతరను తలపించే బహిరంగ సభలు.. ఓటర్లను ఆకర్షించడానికి మొదలయ్యే ప్రలోభాలు.. మొత్తంగా మూడు బిర్యానీ ప్యాకెట్లు, ఆరు మధ్యం సీసాలుగా వర్దిల్లుతుంది ఎన్నికల తతంగం. డబ్బు, ఏరులై పారే మధ్యం.. ఏం చేసినా జనాన్ని పార్టీ వెంట నడిపించడం కోసమే. అంతిమంగా ప్రలోభాలన్ని బ్యాలెట్ లో ఓట్లను మూటగట్టుకోవడానికే. తమిళనాడు తాజా ఎన్నికల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.
ముఖ్యంగా.. తమిళనాడులో బిర్యానీ తయారీదారుల పంట పండుతోంది. ఎన్నికల కార్యక్రమమేదైనా చేతిలో బిర్యానీ ప్యాకెట్ పెట్టి పంపిస్తున్నాయి అక్కడి పార్టీలన్ని. ఇందుకోసం భారీ ఎత్తున బిర్యానీ సెంటర్లకు ఆర్డర్లు అందుతుండడంతో తమ కాసుల పంట పండిందని భావిస్తున్నారు తయారీదారులు. కేజీ, అరకేజీ బిర్యానీ పొట్లాలను ప్రచారానికి వచ్చే జనాలకు పంపిణీ చేస్తున్నాయి పార్టీలు. ఈ బిర్యానీలను తయారు చేయడానికి.. వెయ్యి కేజీల చికెన్ బిర్యానికైతే 80 వేలు, అదే మటన్ బిర్యానీకైతే లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు బిర్యానీ తయారీదారులు.
ఎండాకాలం పెరుగున్నం తినడమే మంచిదైనప్పటికీ.. పప్పు భోజనానికి, పెరుగున్నానికి జనం రారని అందుకే పార్టీలన్నీ బిర్యానీ బాట పట్టాయని చెప్తున్నారు బిర్యానీ సెంటర్ నిర్వాహకులు. అయితే ఆర్డర్ చేసిన బిర్యానీ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ఆయా పార్టీల నేతలు డబ్బు చెల్లించే విషయంలో మాత్రం మొండికేస్తున్నారని వాపోతున్నారు వ్యాపారులు.