ఎగ్జిట్ పోల్స్: జయలలితకు మళ్లీ పాత కష్టాలు, జైలుకేనా?
చెన్నై: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓడిపోవచ్చని సూచిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే జయలలితకు మళ్లీ పాత కష్టాలు మొదలవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు ఎన్నికల తర్వాత విడుదలై ఎగ్జిట్ పోల్స్లో ఒక్క సి ఓటర్ మాత్రమే జయలలిత గెలుస్తుందని చెప్పగా, మిగతా సర్వేలన్నీ కూడా ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ క్రమంలో తన 92వ పుట్టిన రోజు నాటికి (జూన్ 3) తమిళనాడులో మరోసారి కరుణానిధి ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం సాగుతోంది.
ఎగ్జిట్ పోల్స్ నిజమై కరుణానిధి అధికారంలోకి వస్తే ఆయన ప్రభుత్వం చేసే మొట్ట మొదటి పని జయలలితపై అక్రమ కేసులు బనాయించి ఆమెను వేధింపులకు గురి చేయడమే. ఎందుకంటే జయలలిత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో వ్యవహరించారు.

అంతేకాదు 2016 ఎన్నికల్లో జయలలితతో పొత్తులు పెట్టుకోవాలని ప్రధాని మోడీ స్వయంగా ప్రయత్నిస్తే ఆమె తిరస్కరించింది. ఆమె కాదనడంతో డీఎండీఎంకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్తో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తే ఆయన కూడా బీజేపీని అవమానించారు. దీంతో చేసేదేమీ లేక చివరకు తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమిళనాడులో ఆ పార్టీకి 4 సీట్లు కూడా దక్కడం కష్టమేనని అంటున్నారు. తమిళనాడులో బీజేపీకి ఇటువంటి అవమానకర పరిస్థితి కలగడానికి కారణం అమ్మ బీజేపీ ఆఫర్ను తిరస్కరించడమేనని అంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో జయలలిత ఓడిపోతే, ఆమెపై సుప్రీం కోర్టులో ఉన్న అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయిస్తే ఆమెకు జైలుకు వెళ్లడం ఖాయమే.
మరోవైపు తమిళనాడులో బీజేపీ నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ అండదండలు అవసరం కాబట్టి, జయలలితను అక్రమాస్తుల కేసు నుంచి మోడీ ప్రభుత్వం కాపాడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా జరగకుండా తమిళనాడులో తిరిగి జయలలిత అధికారంలోకి వస్తే, ఆమె పార్టీ జైత్రయాత్రను ఆపడం ఎవరి వల్ల కాదని కూడా అంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్లో అన్నాడిఎంకే ఓడిపోతుందని సర్వేలు చెబుతుండటంతో ఆ పార్టీ అధినేత్రి ఇంటి వద్ద సైలెంట్ వాతావరణ నెలకొంది. అన్నాడిఎంకే ఓడిపోయి డిఎంకే గెలుస్తుందన్న వార్తలతో చెన్నైలోని పోయెస్ గార్డెన్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ నాయకుల ద్వారా ఓటింగ్ పర్సంటేజ్లను జయలలిత తెప్పించుకున్నారని సమాచారం. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్పై జయలలితో చర్చించే ధైర్యం ఎవ్వరికీ లేకపోవడంతో ఏ నాయకుడూ జయ నివాసానికి వెళ్లలేదు. కాగా, ఎగ్జిట్ పోల్స్పై ఆయా ఛానెళ్లు ఇచ్చిన అన్ని వివరాలను జయలలిత చూశారని అన్నాడిఎంకే పార్టీ వర్గాల తెలిపాయి.












Click it and Unblock the Notifications