జయ మేనకోడలు దీపా వర్గీయులపై శశికళ అండ్ కో దౌర్జన్యం: తాళం
జయలలిత మేనకోడలు దీపా పేరవై సమావేశాలను శశికళ మద్దతుదారులు అడ్డుకుంటున్నారు. చెన్నైలో దీపా మద్దతుదారులు బుక్ చేసుకున్న కల్యాణమండపంకు తాళం వేసి పోలీసులను రంగంలోకి దించి .
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతుదారులను అన్నాడీఎంకే చీఫ్ శశికళ వర్గీయులు బెదిరిస్తున్నారు. వారు నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకుని మీ అంతు చూస్తాం అని హెచ్చరిస్తున్నారు.
ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్బంగా మంగళవారం తన రాజకీయ రంగప్రవేశం గురించి చెబుతానని ఇప్పటికే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ చెప్పారు. ఈ సందర్బంలో చెన్నైలోని విరుగంబాక్కంలో దీపా మద్దతుదారులు ఓ సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అంతే: తుగ్లక్ !
దీపా పేరవై తరపున విరుగంబాక్కంలో ఓ కల్యాణమండపం ముందుగానే బుక్ చేసుకుని అక్కడ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. అయితే సమావేశం నిర్వహకులు అక్కడికి వెళ్లి చూడగా కల్యాణమండపంకు తాళం వేసి ఉంది.
అంతే కాకుండా దీపా పేరవై సమావేశం నిర్వహించడానికి వీలులేదని పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము దీపా పేరవై సమావేశం నిర్వహించడానికి ఈనెల 13వ తేదిన కల్యాణమండపం బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చామని దక్షిణ చెన్నై అమ్మ పేరవై కార్యదర్శి కె.పుగళేంది మీడియాకు చెప్పారు.
జయలలిత మేనకోడలు దీపా డెడ్ లైన్: నేడు ప్రకటన !
తాము సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకోగా చర్చ సమావేశాలకు అనుమతి అవసరం లేదని పోలీసు అధికారులు చెప్పారని, ఇప్పుడు అనుమతి లేదని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని, శశికళ వర్గీయుల ఒత్తిడితో ఇలా దౌర్జన్యం చేస్తున్నారని దీపా వర్గీయులు ఆరోపించారు.
శశికళ మద్దతుదారులు కల్యాణమండపం యజమానిని బెదిరించి తాళాలు వేయించారని దీపా మద్దతుదారులు ఆరోపించారు. ఇలా ఎన్ని రోజులు అడ్డుకుంటారో చూస్తాం, ఇలాగే జరిగితే నడిరోడ్లలో బహిరంగ సమావేశాలు నిర్వహించి చిన్నమ్మకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామని శశికళ వర్గీయులను దీపా మద్దతుదారులు హెచ్చరించారు.