జీఎస్టీకి అప్పుడే నిరసన సెగ: 950థియేటర్స్ బంద్.. పన్నుపై తేల్చాలని!
ఈ మేరకు సోమవారం నుంచి, సుమారు 950థియేటర్లు స్క్రీనింగ్ నిలిపివేయనున్నాయి. తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్.శ్రీధర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
చెన్నై: జీఎస్టీకి అప్పుడే నిరసన సెగ మొదలైంది. పెరిగిన శ్లాబు రేట్లు థియేటర్ల ఆదాయానికి గండి కొడుతాయన్న ఆందోళన నెలకొన్న తరుణంలో.. అదనంగా మరో 30శాతం మునిసిపల్ ట్యాక్స్ విధించాలన్న తెర వెనుక ప్రయత్నాలు థియేటర్స్ యాజమాన్యాలకు తీవ్ర ప్రతికూలతలను సృష్టిస్తాయని వారు వాపోతున్నారు.
జీఎస్టీ ఎఫెక్ట్: సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్
ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనివ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ తమిళనాడు థియేటర్ యాజమాన్యాలు బంద్ కు పిలుపునిచ్చాయి. జీఎస్టీపై వ్యతిరేకతతో పాటు మునిసిపల్ పన్నుపై స్పష్టతనివ్వాల్సిందిగా కోరుతూ యాజమాన్యాలు నిరసనకు సిద్దమవుతున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి, సుమారు 950థియేటర్లు స్క్రీనింగ్ నిలిపివేయనున్నాయి. తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్.శ్రీధర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే పలు థియేటర్ యాజమాన్యాలు, మల్టీప్లెక్సులు బుకింగ్స్ ను నిలిపివేశాయి. థియేటర్ యాజమాన్యాల డిమాండ్లతో తమిళనాడు నిర్మాతల సంఘం కూడా ఏకీభవించింది. తమిళనాడులో వసూలు చేయబోయే వినోద పన్ను జీఎస్టీలో భాగమా? లేక వేరుగా ఉంటుందా? అన్న దానిపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టత కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విశాలో డిమాండ్ చేశారు.
థియేటర్ యాజమాన్యాలు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ డిమాండ్లతో.. తమిళనాడు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పీ వేలుమణి రంగంలోకి దిగారు. ఇరు వర్గాలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సినిమా టికెట్లపై పన్నును రెండు కేటగిరీలుగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ.100లోపు టికెట్లపై 18శాతం, రూ.100కు పైన టికెట్లపై 28శాతం జీఎస్టీ రేట్లను కౌన్సిల్ నిర్ణయించింది.