రాజీవ్ హంతకుల విడుదల అంశం గవర్నర్ చేతిలో ఉంది : పళనిస్వామి
చెన్నై : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు సంవత్సరాల తరబడి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారిని విడుదల చేసే విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు సీఎం పళనిస్వామి. వారిని విడుదల చేసేందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
అయితే వారి విడుదలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ నిర్ణయం పెండింగ్లో ఉందన్నారు. ఈ మధ్య రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయాలని అటు విపక్షాల నుంచి ఇటు ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున వత్తిడి పెరగడంతో.. తాజాగా పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదివరకు రాజీవ్ గాంధీ హంతకులను రిలీజ్ చేయాలని వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జైలుశిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులను విడుదల చేయాలని గతేడాది సెప్టెంబర్ నెలలో పళనిస్వామి కేబినెట్ తీర్మానించింది. ఆ మేరకు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు నివేదిక పంపింది. గవర్నర్ నిర్ణయం తీసుకుంటే వారిని వదిలిపెట్టడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభిష్టం మేరకు వారిని గౌరవిస్తూ రాజీవ్ హంతకుల విడుదలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని చెప్పుకొచ్చారు.
యెల్లో శారీ ఆంటీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. మొన్న పోలింగ్ ఆఫీసర్.. నిన్న ఓటర్
పెరంబుదూర్లో 1991 మే 21న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబర్లు రాజీవ్గాంధీని హత్య చేశారు. ఆ కేసుకు సంబంధించి నళిని, రవిచంద్రన్, జయకుమార్, మురుగన్, శంతన్, పెరరివలన్, రాబర్ట్ పాయాస్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారి విడుదల విషయం గవర్నర్ చేతిలోనే ఉందంటున్నారు పళనిస్వామి.