Tamilnadu Covid 19 guidelines : ఆ రెండు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి హోం క్వారెంటైన్...
మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాలు,విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం... మహారాష్ట్ర,కేరళ నుంచి తమిళనాడు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజుల హోమ్ క్వారెంటైన్ పాటించాలి.
మహారాష్ట్ర,కేరళ మినహా ఇతర రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తమిళనాడుకు వచ్చేవారు... రాష్ట్రానికి వచ్చిన 14 రోజుల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కరోనా లక్షణాలతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారు తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలి.
యూకె,యూరోప్,బ్రెజిల్,సౌతాఫ్రికా,మిడిల్ ఈస్ట్ మినహా ఇతర దేశాల నుంచి తమిళనాడు వచ్చేవారు తప్పనిసరిగా 14 రోజులు స్వీయ ఆరోగ్య పర్యవేక్షణలో ఉండాలి.యూకె,యూరోప్,బ్రెజిల్,సౌతాఫ్రికా,మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ కరోనా నెగటివ్ సర్టిఫికెట్తో రావాలి. ప్రయాణానికి 72 గంటల వ్యవధిలో ఆ టెస్టులు చేయించుకుని ఉండాలి.
యూకె,సౌతాఫ్రికా,బ్రెజిల్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు... భారత్లో వారు ల్యాండ్ అయిన విమానంలో కరోనా నెగటివ్ సర్టిఫికెట్ పొందితేనే... అక్కడినుంచి కనెక్టింగ్ ఫ్లైట్కు అనుమతి ఉంటుంది. అనంతరం ఏడు రోజుల పాటు హోం క్వారెంటైన్ పాటించాలి. ఏడో రోజు చేసే కరోనా టెస్టుల్లో నెగటివ్గా తేలితే హోం క్వారెంటైన్ నుంచి వారు బయటకు రావొచ్చు.
కాగా,మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల్లో మరోసారి కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా ప్రతీరోజూ ఆరు వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 8800 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వసీం జిల్లాలోని ఒకే స్కూల్కి చెందిన 225 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇప్పటికే అమరావతి,యావత్మల్ తదితర జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్ను కూడా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. మాస్కులు ధరించకపోవడం,భౌతిక దూరం పాటించకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత ధోరణితోనే మహారాష్ట్రలో మళ్లీ కేసులు విజృంభిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.