అమృత జయలలిత కుమార్తె అవునా, కాదా ? చెప్పండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె నేనే అంటూ బెంగళూరుకు చెందిన అమృత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 25లోపు సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హై కోర్టు ఆదేశించింది. జయలలిత కుమార్తె నేనే అంటూ బెంగళూరుకు చెందిన అమృత మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
డీఎన్ఏ పరీక్షలు !
జయలలిత కుమార్తె నేనే అంటూ అమృత మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి డీఎన్ఏ పరీక్షలు చెయ్యాలని మనవి చేశారు. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు.
దీపా, దీపక్
తమిళనాడు ప్రభుత్వంతో సహా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ తదితరులను సమాధానం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
సమయం ఇవ్వండి !
అమృత పిటిషన్ పై సమాధానం దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది మరికొంత సమయం కోరారు. దీనిని ఆమోదించిన మద్రాసు హై కోర్టు ఈనెల 25వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
వాయిదా
బెంగళూరుకు చెందిన అమృత పిటిషన్ తదుపరి విచారణను మద్రాసు హైకోర్టు ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం, జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ ఏం సమాధానం చెబుతారో అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఆరా తీస్తున్నాం !
బెంగళూరుకు చెందిన అమృత గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరు చేరుకుని అమృత, ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు సేకరించారని తెలిసింది.