మహిళా జర్నలిస్టు బుగ్గ మీద చెయ్యి: ప్రతిపక్షాల ఆందోళన, గవర్నర్ క్షమాపణలు, లేఖ!
Recommended Video
చెన్నై: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మహిళా జర్మలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ కు క్షమాపణలు చెబుతూ లేఖ పంపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజ్ భవన్ లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో లేడీ జర్నలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఆందోళనకు దిగడంతో చివరికి ఆయన క్షమాపణలు చెప్పారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మహిళా జర్మలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ కు క్షమాపణలు చెబుతూ బుధవారం లేఖ పంపించారు.
మనువరాలు
మనువరాలి వయసులో ఉన్న లక్ష్మి సుబ్రమణియన్ ను అభినందించేందుకే ఆమె చెంపను తాకానని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ వివరణ ఇచ్చుకున్నారు. తన చర్య పట్ల మహిళా జర్నలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ బాధపడినందుకు ఆమెకు క్షమాపణ చెబుతున్నానని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ వివరించారు.
తప్పుగా అర్థం చేసుకోవద్దు
దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మహిళా జర్నలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ కు మనవి చేశారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తీరుపై బుధవారం తమిళనాడులో డీఎంకే తో పాటు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగిన సమయంలో ఆయన క్షమాపణలు చెప్పాడం కొసమెరుపు.
మహిళ ప్రొఫెసర్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటైకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి తనకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తో పరిచం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో గవర్నర్ మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు.
సమాధానం చెప్పకుండా!
మహిళా ప్రొఫెసర్ నిర్మలా దేవి ఎవరో తనకు తెలియదని బన్వరిలాల్ పురోహిత్ విలేకరులకు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఓ ఆంగ్ల వారపత్రిక మహిళా జర్నలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సమాధానం చెప్పకుండా ఆమె చెంపను తాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఘాటుగా ట్వీట్
విలేకరుల సమావేశంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ను ఓ ప్రశ్న అడిగితే అందుకు సమాధానం చెప్పకుండా ఆయన నా చెంపను తాకారు, నేను సహించుకోలేకపోతున్నాను అంటూ మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రమణియన్ ఘాటుగా ట్వీట్ చేశారు.
మంచి పద్దతికాదు
లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సాక్షాత్తు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇలా ప్రవర్తించడం మంచిపద్దతి కాదని, ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకకూడదని మీకు తెలీదా, ఇది మంచి పద్థతి కాదు, మీకు మా తాతగారి వయసు ఉంటుందని మహిళా జర్నలిస్టు లక్ష్మి సుబ్రమణియన్ వరుస ట్వీట్ లు చేసి అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలకు అస్త్రం
మొదటి నుంచి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తీరుమీద ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకోవడం, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇప్పుడు పత్రిపక్షాల చేతికి మంచి అస్త్రం ఇచ్చినట్లు అయ్యింది.