ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించిన మరో రాష్ట్రం: ఆరు నెలల జైలు, జరిమానా
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఇక నుంచి రమ్మీ ఆడితే ఆరు నెలలపాటు జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఆన్లైన్ గేమింగ్ హౌస్ నడిపితే రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ గేమ్ ఆడి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కారు ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేశారు. కాగా, ఆన్లైన్ రమ్మీకి ప్రచారం చేసినందుకు ఇటీవల క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, నటులు ప్రకాశ్ రాజ్, సుదీప్, రానా, తమన్నాలకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మదురైకి చెందిన మహ్మద్ రజ్వీ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారించింది. ఆట కోసం ప్రచారం చేస్తున్న ప్రముఖులు.. ప్రజా శ్రేయస్సును విస్మరిస్తూ స్వలాభంపైనే దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించింది.
క్రికెట్ విషయంలోనూ రాష్ట్రాల పేర్లు ఉపయోగిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని పేర్కొంది. అంతేగాక, ఆన్లైన్ రమ్మీ నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవలే ఆన్లైన్ రమ్మీ, పోకర్ గేమ్స్ను నిషేధం విధించిన విషయం తెలిసిందే.