జయలలిత కుమార్తె అంటున్న అమృతపై పరువు నష్టం దావా: పళని, పన్నీర్ ఓకే!
Recommended Video
చెన్నై/బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శోభన్ బాబుల కుమార్తె నేనే అంటూ హైకోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్న బెంగళూరు మహిళ అమృత (37) విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అమృత విషయంలో చూసిచూడనట్లు ఉంటే ఈ వ్యవహారం చాలా వరకు వెళ్లే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
దేశ విదేశాల్లో అమ్మ అభిమానులు
దేశ విదేశాల్లో లక్షల మంది అభిమానులు ఉన్న జయలలితకు వివాహం కాకపోయినా తానే ఆమె కుమార్తె అంటూ అమృత ప్రచారం చేసుకుంటున్నారని పలువురు అన్నాడీఎంకే పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జయలలిత కుమార్తె అంటూ అమృత తెరమీదకు రావడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
శోభన్ బాబు, జయల కుమార్తె!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అలనాటి ప్రముఖ నటుడు శోభన్ బాబులకు తాను జన్మించానని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల బెంగళూరుకు చెందిన అమృత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అక్కడికే వెళ్లండి!
హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా మీరు సుప్రీం కోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం అమృతను ప్రశ్నించింది. మీరు హై కోర్టును ఆశ్రయించండి, అక్కడ న్యాయం జరగకపోతే తరువాత ఇక్కడకు రావాలని సుప్రీం కోర్టు సూచించింది.
అజ్ఞాతంలోకి అమృత!
సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమృత తనకు కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ఫోన్లు చేసి చంపేస్తామని బెదరిస్తున్నారని ఆరోపించారు. తరువాత అమృత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమృత బెంగళూరులో ఉన్నారా ? లేదా ? అనే విషయం కచ్చితంగా తెలియడం లేదు.
సీఎం పళని, పన్నీర్ సెల్వం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అమృత నా ? కాదా ? అంటూ తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం అమృత హాట్ టాఫిక్ అయ్యారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరా తీశారు.
రంగంలోకి ఇంటలిజెన్స్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆదేశాల మేరకు తమిళనాడు ఇంటలిజెన్స్ అధికారులు బెంగళూరు చేరుకుని అమృత నివాసం ఉంటున్న ప్రాంతంలో రహస్యంగా విచారణ మొదలు పెట్టి వివరాలు సేకరించారని తెలిసింది.
మొత్తం హిస్టరీ
అమృత తల్లి శైలజ ఎవరు, శైలజకు ఎంత మంది సంతానం ఉన్నారు, శైలజ మూలాలు ఏమిటి, అమృత హిస్టరీ ఏమిటీ అనే పూర్తి సమాచారం సేకరించిన ఇంటలిజెన్స్ అధికారులు ఆ నివేదిక తమిళనాడు ప్రభుత్వానికి అందించారు.
పరువునష్టం దావా
అమృత ఆమె తల్లి శైలజ పూర్తి వివరాలు పరిశీలించి న్యాయనిపుణులతో చర్చించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత జయలలిత పేరుప్రతిష్టకు భంగం కలిగిస్తున్న అమృత మీద చట్టపరంగా పరువు నష్టం దావా వెయ్యాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది.