జయలలితకు పాకిస్థాన్ మీడియా జేజేలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నిత్యం ఏదో ఒక వార్తలలో సంచలనం సృష్టిస్తుంటారు. జయలలితకు తమిళనాడుతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దాయాది పాకిస్థాన్ లో జయలలితకు జేజేలు పలుకుతున్నారు.
అందుకు కారణం తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం ముస్లీంల కోసం అమలు చేస్తున్న పథకాలు అని పాకీస్థాన్ టీవీ చానెల్ సమ్మా ప్రసారం చేస్తున్నది. జయలలితను ప్రశంసలతో ముంచెత్తింది.
రంజాన్ పండుగ సందర్బంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 వేలకు పైగా మసీదులకు 4,500 టన్నుల బియ్యం ఉచితంగా సరఫరా చెయ్యాలని కుమారి జయలలిత ఆదేశాలు జారీ చేశారు. ఆ బియ్యంతో గంజి తయారు చేసి మసీదుల దగ్గర ముస్లిం సోదరులకు పంపిణి చెయ్యాలని సూచించారు.
ఇలాంటి పథకాలు పాకిస్థాన్ లోను అమలు చెయ్యాలని టీవీ చానెల్ సమ్మా ప్రసారం చేసింది. తమ అధినేత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ కు చెందిన సమ్మా టీవీ చానెల్ ప్రసారం చేసి అభినందించిందని అన్నా డీఎంకే అధికారిక పత్రిక డాక్టర్ అమదు ఎంజీఆర్ వెల్లడించింది. టీవీలో జయలలిత ఫోటోలతో పాటు పార్టీ సింబర్ రెండు ఆకుల గుర్తును సమ్మా టీవీ చానెల్ ప్రసారం చేసిందని వివరించారు.