ఎన్నికల ఎఫెక్ట్: విద్యార్థులకు రోజుకు 2 జీబీ ఉచిత డేటా, 4 నెలలపాటు
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది. జనవరి 2021 నుంచి ఏప్రిల్ 2021 వరకు కాలేజీ విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటా ఉచితంగా అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉచిత సదుపాయం వర్తిస్తుందని సీఎం పళనిస్వామి ప్రకటించారు. ప్రభుత్వ, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో విద్యార్థులు ఈ ఉచిత డేటా పథకానికి అర్హులు.
ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న 9.69 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు పళనిస్వామి తెలిపారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు మూతబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉచిత డేటా ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం.
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉచిత ఆఫర్లు ప్రకటిస్తుండటం గమనార్హం. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల విద్యా రుణాలు మాఫీ చేస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. అక్కడకు కొద్ది రోజులకే యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంగా పళనిస్వామి ప్రీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుండటం గమనార్హం.
తమిళనాడులో డిసెంబర్ 2 నుంచే పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కాలేజీలు ప్రారంభమైనప్పటికీ.. తరగతులకు హాజరుకావడం అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టానికి వదిలేశారు. అదే సమయంలో ఆన్లైన్ క్లాసులు కొనసాగుతూనే ఉన్నాయి.