ఇండియన్ జార్జ్ ఫ్లాయిడ్స్ : కేసు సీబీఐకి బదిలీ అయ్యే ఛాన్స్... సీఎంపై కమల్ ఫైర్...
తమిళనాడులో చోటు చేసుకున్న జయరాజ్,బెనిక్స్ల కస్టోడియల్ డెత్పై అమెరికా జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరహాలో నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్లో ముందుండి పనిచేస్తున్నారన్న ప్రశంసలు మూటగట్టుకున్న పోలీస్ వ్యవస్థ పైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యకు పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించనుంది.
Recommended Video
కరోనా విజృంభణ: తమిళనాడు సీఎం వ్యక్తిగత సహాయకుడు మృతి
సీబీఐకి అప్పగించే ఆలోచన...
'ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్రాస్ హైకోర్టుతో సంప్రదింపుల తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం.' అని ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. మద్రాస్ హైకోర్టు దీన్ని సుమోటో కేసుగా తీసుకుందన్నారు.లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల కింద ఆ తండ్రీ కొడుకులను కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాతి రోజు రిమాండ్కు తరలించారని.. ఆ మరుసటిరోజే ఇద్దరూ మృతి చెందారని చెప్పారు.
మర్మాంగాల్లో కర్రలు దూర్చి చిత్రహింసలు...
ప్రస్తుతం ఈ కేసు విచారణ చేపడుతున్న పోలీస్ బృందంలో ఒకరైన అధికారి మాట్లాడుతూ... ప్రాథమిక విచారణలో ఆ ఇద్దరి దుస్తులు విప్పి చిత్రహింసలకు గురిచేసినట్టు గుర్తించామన్నారు. వారి మర్మాంగాల్లో కర్రలను దూర్చి హింసించారని చెప్పారు. జయరాజ్ కంటే బెనిక్స్కు ఎక్కువ రక్తస్రావమైందన్నారు. ఓ పోలీస్ అధికారి తన తండ్రిని కొడుతున్న సమయంలో బెనిక్స్ అడ్డుపడినందుకు అతనిపై కూడా దాడి చేసినట్టు గుర్తించామన్నారు.
మెజిస్ట్రేట్ తీరుపై విమర్శలు...
జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు జయరాజ్(62),బెనిక్స్(32)ల కుటుంబ సభ్యులు నిరాకరించారు. మంగళవారం హైకోర్టులో విచారణ కోసం ఎదురుచూస్తున్నామని... కోర్టు ఏం చెబుతుందో చూస్తామని చెప్పారు. అయితే సరైన విచారణ లేకుండానే జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పి శరవణన్ తమవాళ్లిద్దరినీ కస్టడీకి పంపించారని వారు ఆరోపించారు.
జయరాజ్ బంధువు ఏమన్నారంటే....
జయరాజ్ సోదరి భర్త జోసెఫ్ ఈ ఘటనపై మాట్లాడుతూ... 'ఆ ఇద్దరిని తీసుకొచ్చి కోర్టు గేటు వద్ద నిలబడ్డారు. వారి చుట్టూ ఏడెనిమిది మంది పోలీసులు ఉన్నారు. అప్పటికే వారి బట్టలు రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. ఆ ఇద్దరినీ కోర్టు లోపలికి తీసుకెళ్లలేదు. మొదటి అంతస్తు నుంచి మెజిస్ట్రేట్ వారిని చూసి చేతులు ఊపారు. ఓ పోలీస్ అధికారి కోవిల్పట్టి రిమాండ్ అని గట్టిగా అరవడంతో.. మెజిస్ట్రేట్ వెంటనే క్లియరెన్స్ ఇచ్చేశాడు.' అని చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్ ఆగ్రహం...
జయరాజ్,బెనిక్స్ కుటుంబ సభ్యులను కమల్ హాసన్ ఆదివారం(జూన్ 28) పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే హత్యలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనకు సీఎం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మౌనం వహించేవాళ్లు, వాటిని సమర్థించేవాళ్లు కూడా శిక్షార్హులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెల్లువెత్తుతున్న నిరసనలు...
మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు కింది స్థాయి వర్గాలకు చెందినవారు కావడం వల్లే ఇంత అమానుషమైన దాడి జరిగిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కులం,హోదా,స్థాయిని బట్టే పోలీసుల ట్రీట్మెంట్ కూడా ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ వ్యవస్థలో ఎలాంటి పక్షపాతం లేదని నిరూపించాలంటే బాధ్యులైన పోలీసులను కేవలం సస్పెన్షన్తో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.