ఐటీ ప్రకంపనలు: మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ నేడే?, మరో ముగ్గురు మంత్రులపైనా..
తమిళనాడులో ఐటీ శాఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే మంత్రి విజయ భాస్కర్, ప్రముఖ నటుడు, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్, అతని భార్య, ప్రముఖ నటి రాధిక ఇళ్లలో, రాధికకు చెందిన రాడాన్ సంస్థ.
చెన్నై: తమిళనాడులో ఐటీ శాఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే మంత్రి విజయ భాస్కర్, ప్రముఖ నటుడు, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్, అతని భార్య, ప్రముఖ నటి రాధిక ఇళ్లలో, రాధికకు చెందిన రాడాన్ సంస్థ కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
రాధికకు మరో చిక్కు: రాడాన్ సంస్థ భారీగా పన్ను ఎగవేత, తేల్చేసిన ఐటీ అధికారులు
విజయభాస్కర్ ఇంట్లో దొరికిన ఆధారాలతో మరో ముగ్గురు మంత్రులపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. ఏ క్షణంలోనైనా వీరిని ఐటీ శాఖ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. విజయభాస్కర్ పీఏ వద్ద భారీగా డబ్బులు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు తెలిసింది.
ఐటీ అధికారిణి పట్ల దురుసుగా..
కాగా, విజయభాస్కర్ తోపాటు మరో ఇద్దరు మంత్రులు.. మహిళా ఐటీ అధికారి పట్ల దురుసు ప్రవర్తించారంటూ పోలీసులకు ఐటీ శాఖ ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది ఇలా ఉంటే, బుదవారం రాత్రి 11గంటల వరకూ రాధిక, శరత్ కుమార్లను ఐటీ శాఖ అధికారులు విచారించారు. రాడాన్ మీడియా సంస్థ రూ.4.5కోట్ల మేర పన్ను ఎగవేసిందని ఐటీ శాఖ తేల్చింది. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు రాధిక అంగీకరించారు. మరోసారి కూడా వీరిని విచారణకు పిలిచే అవకాశం ఉంది.
మంత్రుల ఉక్కిరిబిక్కిరి
ఐటీ శాఖ దాడులతో తమిళ మంత్రులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన నివాసంలో 5.5 కోట్ల నగదు పట్టుబడిన తర్వాత కూడా మంత్రి అదృష్టం కొద్దీ అరెస్టును తప్పించుకున్నా.. తాజా పరిణామాలు నేపథ్యంలో కటకటాల వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
విజయభాస్కర్ అరెస్ట్కు రంగం సిద్ధం
అయితే, గురువారం ఆయన ఆట ముగిసినట్టేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక రోజంతా జరిగిన ఐటీ విచారణలో మంత్రి సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో గురువారం ఐటీ అధికారులు మళ్లీ ఆయనను ప్రశ్నించబోతున్నారు. ఆర్కేనగర్లో ఓటర్లకు నగదు పంపిణీపై అధికారులు తగిన సాక్ష్యాధారాలు సేకరించగలిగారు.
కటకటాలు వెనక్కే..
ఈ క్రమంలో గురువారం జరిగే విచారణ కీలకం కానుంది. మంత్రి నుంచి సరైన సమాధానాలు రాని పక్షంలో ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం రావచ్చునని ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో మంత్రి విజయభాస్కర్కు కటకటాలు తప్పేలా కనిపించడం లేదు.
ప్రభుత్వాన్ని రద్దు చేయాలి..
కాగా, తమిళనాడు సీఎం పళనిస్వామిని తొలగించాలని, ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలంటూ డీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీలో గవర్నర్ను కోరుతున్నాయి. శశికళ వర్గాన్ని బలహీనపర్చేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని పలువురు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.