కరోనా వైరస్ పేషెంట్ల కోసం రంగంలో దిగిన రోబోలు: ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో.. !
చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం ఇక హ్యూమనాయిడ్ రోబోలు రంగంలో దిగబోతున్నాయి. ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో వాటి సేవలను విస్తృతంగా వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల సేవలను విస్తారంగా వినియోగంలో రావడంమంటూ జరిగితే- హెల్త్ కేర్ వర్కర్లు, నర్సులపై ప్రస్తుతం ఉన్న తీవ్ర ఒత్తిడి నుంచి కాస్తయినా ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హ్యూమనాయిడ్ రోబోల సేవలు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఐసొలేషన్ కేంద్రాల్లో వాటిని వినియోగించుకోవడంపై జిల్లా అధికార యంత్రాంగం ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమతి లభించిన వెంటనే వాటి సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తామని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని, ఇంకా ఆమోదం లభించాల్సి ఉందని వెల్లడించారు.
తిరుచిరాపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఈ హ్యూమనాయిడ్ రోబోలను రూపొందించింది. ఐసొలేషన్ కేంద్రాల్లో నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లకు ప్రత్యామ్నాయంగా పనిచేసేలా ఈ రోబోలను తయారు చేసింది. ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతోన్న కరోనా పేషెంట్లకు నిర్దేశిత సమయానికి మందులు ఇచ్చేలా ఈ రోబోల సాఫ్ట్వేర్ను డిజైన్ చేశారు. ఏ సమయానికి, ఏ పేషెంట్కు, ఏ రకమైన మందులను అందజేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఈ రోబోల్లో ఫీడ్ చేయాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా అవి పని చేస్తాయని ఆ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.