మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాంటి సాహసం చేయొద్దని హెచ్చరించారు. మద్యం షాపులను గనక తెరవాల్సి వస్తే.. జనం పాతరేస్తారని అన్నారు. అధికారంలోకి రావడాన్ని మర్చిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు.
Recommended Video
వామ్మో.. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికీ పాజిటివ్..505కి చేరిన పాజిటివ్ కేసులు, 17 మంది...
టాస్మాక్ దుకాణాలను తెరవకూడదంటూ..
దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం.. మద్యం షాపులను తెరిచిన విషయం తెలిసిందే. తమిళనాడులో మద్యం దుకాణాలన్నింటినీ అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దీనికోసం మార్కెటింగ్ శాఖలో ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. టాస్మాక్ పేరుతో తమిళనాడు వ్యాప్తంగా మద్యం దుకాణాలు, కల్లు షాపులు కొనసాగుతున్నాయి.
తప్పు పట్టిన తలైవా..
మూడోదశ లాక్డౌన్ సందర్భంగా గ్రీన్జోన్లు, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులను ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకట్రెండు రాష్ట్రాల్లో తప్ప.. అన్ని చోట్లా మద్యం షాపులు తెరచుకున్నాయి. ఈ సందర్భంగా నెలకొన్న రద్దీ ఎలాంటిదో ఈ పాటికే మనకు తెలుసు. తమిళనాడులో మాత్రం కాస్త ఆలస్యంగా టాస్మాక్ షాపులు తెరచుకున్నాయి. అది కూడా పాక్షికంగానే. దీన్ని తప్పు పడుతున్నారు రజినీకాంత్.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా..
ఇప్పటికే పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదువుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం దుకాణాలను గనక తెరిచే సాహసానికి పూనుకుంటే.. అన్నా డీఎంకే ఇక కల్లో కూడా అధికారాన్ని అందుకోలేదని హెచ్చరించారు. మద్యం అమ్మకాలను కొనసాగించాలని ప్రజలు ఎవరూ కోరుకోవట్లేదని అన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తే.. వారి ఆగ్రహానికి గురి కాకతప్పదని చెప్పారు. జనం పాతరేస్తారని చెప్పారు. అధికార పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఖజానాను నింపుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కోవాలని సూచించారు.
అన్నా డీఎంకేపై వ్యతిరేకంగా
చాలాకాలం తరువాత రజినీకాంత్ అధికార అన్నా డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే తొలిసారి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రజినీకాంత్ అనుకూలంగా ఉంటున్నారనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తం అయ్యాయి. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకేతో బీజేపీ సీట్లను కూడా సర్దుబాటు చేసుకుంది. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ సమయంలో రజినీకాంత్ బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి అనుకూలంగా వ్యవహరించారు.
వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహించనున్న వేళ..
అలాంటి ముద్ర ఉన్న రజినీకాంత్.. దాదాపు తాను అనుకూలంగా వ్యవహరిస్తోన్న అన్న డీఎంకేపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం పుట్టినట్టయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో రజినీకాంత్ అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేయడం రాజీకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది. కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదైన వేళ.. మద్యం షాపులను తెరవాల్సిన అవసరం లేదని రజినీ చెప్పుకొచ్చారు.