టీటీవీ దినకరన్ దెబ్బ: ఐటీ దాడులు, నిన్న రాధిక, నేడు రమ్యకు సమన్లు!
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంలో చెన్నైలో జరిగిన ఐటీ శాఖ దాడుల కేసులో మంత్రి భార్య రమ్యకు సమన్లు జారీ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ భార్యను విచారించడానికి సిద్దం అయిన ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆమెకు బుధవారం సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని మంత్రి విజయభాస్కర్ భార్యకు సూచించారు.
పన్నీర్ కు చెక్ పెడుతున్న సీఎం: ఐఏఎస్ లు, సెక్రటేరియట్ లో ? సెల్వం రివర్స్!
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా విచ్చలవిడిగా నగదు పంపిణి చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడుకు చెందిన పలువురు మంత్రులు, నాయకుల మీద నిఘా వేశారు. అప్పట్లో కచ్చితమైన ఆధారాలు సేకరించి ఐటీ శాఖ అధికారులు మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద దాడులు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్ కే నగర్ ఉపఎన్నికల దెబ్బ
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ఏప్రిల్ మొదటి వారంలో తమిళనాడులో పలు చోట్ల ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు చెందిన చెన్నైలోని ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు.
రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, నగదు సీజ్
మంత్రి విజయభాస్కర్ ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు భారీ మొత్తంలో నగదు, కోట్ల రుపాయాల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
టీటీవీ దెబ్బతో శరత్ కుమార్, రాధిక
మంత్రి విజయభాస్కర్ తో సహ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చిన నటుడు, సమతువ మక్కల్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు శరత్ కుమార్ ఇంటిలో, ఆయన భార్య రాధికాకు చెందిన రాడాన్ మీడియా కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అందరికీ సమన్లు ఇచ్చారు
మంత్రి విజయభాస్కర్ తో పాటు శరత్ కుమార్, ఆయన భార్య రాధికకు సమన్లు జారీ చేసిన ఐటీ శాఖ అధికారులు వారిని విచారించి వివరాలు సేకరించారు. తరువాత మంత్రి విజయభాస్కర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల మీద దృష్టిసారించారు.
ఇప్పుడు సీన్ లోకి రమ్య
మంత్రి విజయభాస్కర్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు, ఆ ఆస్తులు ఎలా వచ్చాయి ? మంత్రి, ఆయన భార్య రమ్యతో పాటు ఆ దంపతులు బంధువుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు సిద్దం అయ్యారు. అందుకే మంత్రి విజయభాస్కర్ భార్య రమ్యకు సమన్లు జారీ చేశారు.
టీటీవీ దెబ్బకు మంత్రి పదవి ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు నేరుగా మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచి నగదు బట్వాడా వెళ్లిందని అధికారులు గుర్తించారు. అప్పుడే ఆయన మంత్రి పదవి ఊడిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే టీటీవీ దినకరన్ విజయభాస్కర్ ను మంత్రి పదవి నుంచి తప్పించరాదని పట్టుబట్టడంతో పళనిసామి మౌనంగా ఉండిపోయారు.
జైల్లో టీటీవీ, ఇప్పుడు మంత్రి ఫ్యామిలీ ?
టీటీవీ దినకరన్ తీహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మంత్రి విజయభాస్కర్ కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేశారు. విజయభాస్కర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా అరెస్టు అయితే ఆయన మంత్రి పదవి ఊడిపోతుందని తెలిసింది.