తమిళనాడు సర్కార్ సంచలనం: పురచ్చితలైవి జయలలిత నివాసం స్వాధీనం: ఇకపై అది..
చెన్నై: దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు పురచ్చితలైవి జయలలిత. తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకున్న ఆమె ఎంతో కాలం జీవించలేకపోయారు. ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. సుమారు 70 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళనాడు రాజకీయాల్లో విప్లవ నాయకురాలిగా నిలిచిపోయారు.
ఆ ఒక్కటీ అడక్కు: నిన్న చెప్పారు..నేడు జీవో జారీ: ఉద్యోగులకు పూర్తి వేతనాలకు గ్రీన్ సిగ్నల్
తాజాగా- జయలలిత విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. చెన్నైలో జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్స్ బంగళా వేద ఇళ్లంను స్వాధీనం చేసుకుంది. ఈ దిశగా శుక్రవారం ఆర్డినెన్స్ వెలువడింది. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఈ ఆర్డినెన్స్ను జారీ చేశారు. ఈ బంగళా ప్రభుత్వ వశం చేయడానికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన ఆమోదం తెలిపారు. ఈ బంగళాలో ఉన్న వస్తువులన్నీ యధాతథంగా ప్రభుత్వానికి చెందుతాయని పేర్కొన్నారు.
ఇకపై ఆ బంగళాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చడానికి తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జయలలితకు సంబంధించిన ఫొటోలు, పూర్తి సమాచారాన్ని ఇందులో భద్రపరుస్తారని తెలుస్తోంది. జయలలిత విద్యాభ్యాసం మొదలుకుని సినిమాల్లోకి అడుగు పెట్టడం, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించడం.. పురచ్చితలైవిగా ఆవిర్భవించిన ప్రధాన ఘట్టాలతో కూడిన ఫొటోలు, వినియోగించిన వస్తువులను కూడా స్మారక మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారని తెలుస్తోంది.
Recommended Video
చాలాకాలం పాటు జయలలిత పోయెస్ గార్డెన్స్ బంగళాలో నివాసం ఉన్నారు. సినీ, రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ఆరంభమైంది. 2016 సెప్టెంబర్లో ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరేంత వరకూ జయలలిత ఇదే బంగళాలో నివాసం ఉన్నారు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన తరువాత పార్థివ దేహాన్ని మొదట ఈ బంగళాకే తీసుకొచ్చారు. అనంతరం అభిమానుల కోసం టౌన్హాల్లో ఉంచారు. జయలలిత మరణించిన తరువాత ఆమె సన్నిహితురాలు శశికళ ఆ ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఆస్తుల కేసులో ఆమె అరెస్టయిన తరువాత ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది.