తమిళనాడు రామరాజ్య రథయాత్ర ఎంట్రీ, ప్రతిపక్షాలు అరెస్టు, పన్నీర్ క్లారిటి, 144 సెక్షన్!
చెన్నై: రామమందిరం నిర్మాణం చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నిర్వహిస్తున్న రామరాజ్య రథయాత్ర కేరళ రాష్ట్రం దాటి మంగళవారం తమిళనాడులో ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామరాజ్య రథయాత్రను వెంటనే అడ్డుకోవాలని తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిన పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
144 సెక్షన్
రామరాజ్య రథయాత్ర మంగళవారం కేరళ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ప్రవేశించింది. మార్చి 19వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మార్చి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరునల్వేలి జిల్లాలో 144 సెక్షన్ విధించామని, ఎక్కువ మంది గుమికూడితో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి ఆదేశాలు జారీ చేశారు.
స్టాలిన్ ఆందోళన
శాంతియుతంగా ఉన్న తమిళనాడులో రామరాజ్య రథయాత్ర ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, వెంటనే రథయాత్రను అడ్డుకోవాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ఆందోళన
అన్నాడీఎంకే పార్టీకి మిత్రపక్షంగా ఉంటూ తమిళనాడుప్రభుత్వానికి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు కరుణాస్, తమిమున్ అన్సారీ, తనియరసు, అబుబక్కర్ వెంటనే రామరాజ్య రథయాత్రను తమిళనాడు సరిహద్దుల్లోనే అడ్డుకోవాలని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకులు అరెస్టు
తమిళనాడులో రామరాజ్య రథయాత్రను అడ్డుకోవాలని ధర్నాలు చేస్తూ ఆందోళనకు దిగిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉందని ఐదు మందికంటే ఎక్కువ మంది గుమికూడితే కచ్చితంగా అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
అడ్డుకుంటే సమస్యలు
రామరాజ్య రథయాత్రను అడ్డుకుంటే తమిళనాడులో ఆందోళనలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీలో అన్నారు. శాంతియుతంగా రామరాజ్య రథయాత్ర కొనసాగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారని పన్నీర్ సెల్వం వివరించారు.