రాహుల్ గాంధీకి ఊహించని పోటీ! వాయనాడ్ లోక్ సభ బరిలో ఎలక్షన్ కింగ్
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల్లో ఊహించని అభ్యర్థి ఎదురయ్యారు. ఆ అభ్యర్థి అల్లాటప్పా కాదు. ఎలక్షన్ కింగ్ గా పేరు తెచ్చకున్నారు. మాజీ ప్రధానులు దివంగత పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి, సహా కరుణానిధి, జయలలిత వంటి మహామహులపై తోడగొట్టి, మీసం మెలేసిన గుర్తింపు ఆయనకు ఉంది. తాను రాహుల్ గాంధీపై పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనే కె పద్మరాజన్. తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ సామన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. చిరు వ్యాపారి. టైర్లను రీట్రేడ్ చేసే షాప్ ను నడిపిస్తున్నారు.
సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేత
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు..
దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. ఆయన పోటీ చేస్తుంటారు. చిన్న ట్విస్ట్ ఏమిటంటే.. ఇప్పటిదాకా ఆయన ఏ ఒక్క ఎన్నికలోనూ గెలవలేదు. ఒకవేళ గెలిస్తే.. తనకు గుండెపోటు వస్తుందని తన మీద తానే జోకులు వేసుకుంటారు. పద్మరాజన్ పోటీ చేసే నియోజకవర్గం ఓటర్లు ఆయన ప్రతిభను గుర్తించలేకపోవచ్చు గానీ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనలో ఉన్న టాలెంట్ ను ఐడెంటిఫై చేసింది. అందుకే ఆయనకు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించింది. ఏకంగా మూడుసార్లు పద్మరాజన్ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు మీద ఉన్న రికార్డులను సవరించుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆయన పేరును నమోదు చేసింది.
డబల్ సెంచరీ దాటేశారు..
నామినేషన్ పత్రాలను దాఖలు చేయడంలో పద్మరాజన్ డబల్ సెంచరీ దాటేశారు. వాయనాడ్ లో ఆయన దాఖలు చేసిన నామినేషన్ల సంఖ్య 201. పంచాయతీ మొదలు కుని రాష్ట్రపతి పదవి కాదా.. ప్రముఖులు ఎక్కడ పోటీ చేసినా పద్మరాజన్ అక్కడ ప్రత్యక్షమౌతుంటారు. ప్రముఖులు పోటీ చేసే స్థానాలే ఆయన టార్గెట్. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి కోసం నామినేషన్ దాఖలు చేయగా.. పద్మరాజన్ ఆయనపై పోటీకి నిల్చున్నారు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, స్టాలిన్, విజయ్ కాంత్ వంటి ప్రముఖులు పోటీ చేసిన స్థానాల్లో పద్మరాజన్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
పీవీపై నంద్యాలలో పోటీ చేస్తే.. ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారట.
మనరాష్ట్రంలోని నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో అప్పటి ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుపై తొలిసారిగా పోటీకి నిల్చున్నారాయన. అప్పటి నుంచి ప్రముఖులు ఎక్కడ పోటీ చేసినా, తాను నామినేషన్ వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నానని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని కూడా చెప్పుకొచ్చారు.
ప్రచారం చేయకపోయినా ఓట్లు..
1996లో అయిదు లోక్సభ నియోజకవర్గాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా 8 నామినేషన్లు వేశారు. ఎన్నికల సంఘం మాత్రం రెండంటే రెండు నియోజకవర్గాలకు సంబంధించి న నామినేషన్లనే స్వీకరించిందని చెప్పారు. 30 ఏళ్లలో ఎన్నికల పేరు మీద 30 లక్షల రూపాయలను ఖర్చు చేశానని పద్మరాజన్ అన్నారు. తాను నామినేషన్లు వేస్తానని, ప్రచారం చేయనని అన్నారు. 2011లో తమిళనాడులోని మెట్టూరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేశారు. కనీస ప్రచారం చేయనప్పటికీ.. పద్మరాజన్ కు 6,273 ఓట్లు పోలయ్యాయి. అవే ఆయనకు వచ్చిన ఎక్కువ ఓట్లు.
సరితా నాయర్ కూడా..
రాహుల్పై పోటీగా సోలార్ స్కాం ప్రధాన నిందితురాలైన సరితా నాయర్ కూడా స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం తదుపరి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి ఈ కుంభకోణం ప్రధాన కారణమైంది. ఈ కుంభకోణం సందర్భంగా సరితా నాయర్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.