అద్వానీ హత్యకు బాంబులు ఇచ్చింది ఓ ఉపసర్పంచ్!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ హత్యకు బాంబులు సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తిరునల్వేలి జిల్లాలోని పుదుక్కూడి గ్రామ ఉప సర్పంచ్ డేనియల్ ప్రకాష్ (35)ను కర్ణాటక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో బీజేపీ కార్యాలయం సమీపంలో 2013 సంవత్సరంలో అద్వానీ లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ కేసులో అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు స్లీపర్ సెల్స్గా వ్యవహరిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో డేనియల్ ప్రకాష్ కనీసం మూడు సందర్భాలలో అల్ ఉమా ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు గుర్తించారు.
2011లో మదురైకి 30 కిలోమీటర్ల దూరంలో గల ఆలంపట్టి గ్రామంలో ఓ వంతెన కింద బాంబులు పెట్టి పేల్చేందుకు అల్ ఉమా ఉగ్రవాదులు ప్రయత్నించారు. అప్పుడు కూడా బాంబులు సరఫరా చేసింది ఇతడే కావడం గమనార్హం.
కాగా, అత్యంత శక్తిమంతమైన పైపు బాంబులను పోలీసులు ముందుగానే గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. మరోసారి 2012 సంవత్సరంలో తిరునల్వేలి జిల్లాలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించిన బాంబులను కూడా ప్రకాషే సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.