హీరో కమల్ హాసన్ కు అదే గతి పడుతుంది: సీఎం పదవి మార్కెట్ లో చిక్కదు: మంత్రి కౌంటర్ !
కొత్త రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడులో క్రియాశీలక రాజకీయాలు చెయ్యాలని నిర్ణయించిన బహుబాష నటుడు కమల్ హాసన్ మీద అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్లీ విమర్శలు చేసింది.
చెన్నై: కొత్త రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడులో క్రియాశీలక రాజకీయాలు చెయ్యాలని నిర్ణయించిన బహుబాష నటుడు కమల్ హాసన్ మీద అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్లీ విమర్శలు చేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గురి చేసుకుని గత కొన్ని నెలల నుంచి కమల్ హాసన్ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ప్రధాని మోడీకి వ్యతిరేకం: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో హీరో కమల్ హాసన్ భేటీ !
తాజాగా తమిళనాడులో డెంగ్యూ నివారణలో ప్రభుత్వం విఫలం అయ్యిందని కమల్ హాసన్ సోషల్ మీడియాలో విమర్శించారు. కమల్ హాసన్ కు తమిళనాడు మంత్రి జయకుమార్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు అంటే 100 రోజులు ఆడే సినిమా కాదని మంత్రి జయకుమార్ కమల్ హాసన్ కు గుర్తు చేశారు.
కమల్ కు పార్టీనే లేదు
చెన్నై లో మీడియాతో మాట్లాడిన మంత్రి జయకుమార్ కేవలం అధికారం కోసమే కమల్ హాసన్ తహతహలాడుతున్నారని ఎద్దేవ చేశారు. తాను సీఎం అయిపోతాను అంటున్న కమల్ హాసన్ కు అసలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఆయన కొత్త పార్టీ పెట్టిన తరువాత రాజకీయాల గురించి మాట్లాడాలని గుర్తు చేశారు.
సీఎం పదవి మార్కెట్ లో ఉంటుందా ?
ముఖ్యమంత్రి పదవి అంటే మార్కెట్ లో దొరికే బొమ్మకాదని, ప్రజలు గుర్తించి వారు అంగీకరించి ఓట్లు వేస్తే పదవులు వస్తాయనే విషయం కమల్ హాసన్ గుర్తు పెట్టుకోవాలని మంత్రి జయకుమార్ సూచించారు. ట్విట్టర్ లో ట్వీట్లు చేసుకుంటుంటే సీఎం అయిపోతారా అని కమల్ హాసన్ ను మంత్రి జయకుమార్ ప్రశ్నించారు.
కమల్ హాసన్ కు అదే గతి పడుతుంది
గతంలో మీకంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న నటుడు శివాజీ గణేశన్ రాజకీయాల్లోకి వచ్చి ఘొరంగా దెబ్బతిన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని, తొందరపడి రాజకీయాల్లో వస్తే కమల్ హాసన్ కు అదే గతి పడుతుందని మంత్రి జయకుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
హీరోలు మీటింగ్ పెడితే లక్షల్లో వస్తారు
సినిమా నటులు మీటింగ్ పెడితో లక్షల్లో ప్రజలు వస్తారని, అయితే వారిలో ఎంత మంది ఓట్లు వేస్తారో ఆలోచిస్తే మంచిదని కమల్ హాసన్ కు హితవుపలికారు. సోషల్ మీడియాలో కామెంట్లు చెయ్యడం కాదు, మొదట ఆయన్ను (కమల్ హాసన్)ను రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి రమ్మని మీరైనా చెప్పండి అంటూ మంత్రి జయకుమార్ మీడియాతో అన్నారు.
శివాజీ గణేశన్ విఫలం
1955లో శివాజీ గణేశన్ డీఎంకేకి మద్దతు ఇచ్చారు. తరువాత కామరాజ్ మనవి మేరకు కాంగ్రెస్ లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇందిరాగాంధీ అనంతరం ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి 1987లో తమిజగ మున్నేట్ర మున్నాని అనే సొంత పార్టీ పెట్టి రెండు సంవత్సరాల్లోనే జనతాదళ్ లో పార్టీని విలీనం చేసిన శివాజీ గణేశన్ ఘోరంగా రాజకీయాల్లో విఫలం అయ్యారు. అలాంటి మహానటుడే రాజకీయాల్లో విఫలం అయ్యాడని, కమల్ హాసన్ ఎంతని మంత్రి జయకుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.