ముల్లై పెరియార్ డ్యామ్ వద్ద భవంతుల నిర్మాణాలా..? కేరళ పై భగ్గుమన్న తమిళనాడు..!!
చెన్నై/హైదరాబాద్ : ముల్లై పెరియార్ డ్యామ్ పై మరో సారి విదాలు చెలరేగుతున్నాచి. డ్యాం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికి కేరళ ప్రభుత్వం నియమాలను అతిక్రమిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముల్లై పెరియార్ డ్యామ్ ప్రాంతంలో కట్టడ నిర్మాణపు పనులు చేపడుతున్న కేరళ ప్రభుత్వంపై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో మంగళవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ముల్లై పెరియార్ డ్యామ్ ప్రాంతంలో కేరళ ప్రభుత్వం వాహనాల పార్కింగ్ భవనాన్ని నిర్మిస్తున్న వివాదంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి తదుపరి విచారణను జూలైకి వాయిదా వేసింది.
కేరళపై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్..! వివాదాస్పద స్థలంలో నిర్మణాల పై అభ్యంతరం..!!
ఆ వివాదానికి సంబంధించి అన్నాడీఎంకే ప్రభుత్వం ఇదివరకే ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా కేరళ ప్రభుత్వం ముల్లై పెరియార్ డ్యామ్ వద్దనున్న అటవీశాఖకు చెందిన స్థలంలో వాహనాల పార్కింగ్ భవనం, మరికొన్ని శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపించింది. వాహనాల పార్కింగ్ భవనం నిర్మించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిని జారీ చేయడం గర్హనీయమని పేర్కొంది. వాహనాల పార్కింగ్ భవన నిర్మాణ వివాదానికి సంబంధించిన కేసు విచారణ పెండింగ్లో వున్నప్పటికీ ఆ భవనం నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని, ఆ ప్రయత్నాలపై స్టే విధించాలని అన్నాడీఎంకే ప్రభుత్వం కోరింది.
కేరళ విధానాలను తప్పు పడుతున్న ఎడప్పాడి ప్రభుత్వం..! పద్దతి మార్చుకోవాలని సూచన..!!
ఆ తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వం తరఫున గతేడాది ఆగస్టు 17న మరో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనాల పార్కింగ్ భవనం నిర్మించడానికి కేరళ ప్రభుత్వాన్ని అనుమతించకూడదని వాదించింది. తన వాదనలకు వత్తాసుగా తమిళనాడు ప్రభుత్వం ఫోటో ఆధారాలను కూడా సమర్పించింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్ఏ బాప్టే, ఎస్కే కౌల్, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
వేసవి సెలవుల అనంతరం మళ్లీ విచారణ..! కేరళ తప్పు చేసిందంటున్న న్యాయవాదులు..!!
ఆ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ కేరళ ప్రభుత్వం వాహనాల పార్కింగ్ భవనాన్ని శాశ్వత ప్రాతిపదికన నిర్మించడం కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆ సందర్భంగా కేరళ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఆ పిటిషన్కు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరింది. ఆ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం విచారణ జరుపుతామని ప్రకటించింది.
డ్యాం వద్ద ఎలాంటి నిర్మాణాలు వద్దు..! వాదిస్తోన్న ఏఐఎడీఎంకే..!!
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అన్నాడీఎంకే ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేసింది. ముల్లై పెరియార్ డ్యామ్ వద్ద శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మిస్తున్న కేరళ ప్రభుత్వంపై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్లో కోరింది. ముల్లై పెరియార్ డ్యామ్ నీటిమట్టం పెంచే విషయంగా గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ డ్యామ్ పరిసరాలలో శాశ్వత ప్రాతిపదికన కేరళ ప్రభుత్వంగానీ, తమిళనాడు ప్రభుత్వం గాని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.