మరో వృద్ధుడి సాహసం: బైక్ దొంగను వెంటాడి పిడిగుద్దుల వర్షం, దెబ్బకు పరార్!
చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలిలో వృద్ధ దంపతులు చూపి ధైర్య సాహసాలు మరువకముందే మరో వృద్ధుడు దొంగతో పోరాడి తెగువ చూపిన ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను ఓ దొంగ ఎత్తుకెళుతుండటాన్ని గమనించిన వృద్ధుడు అతడ్ని అడ్డుకున్నాడు.
వెంటాడి పిడిగుద్దుల వర్షం
వెంటాడి పట్టుకుని పిడిగుద్దులు గుద్దాడు. వృద్ధుడి పోరాట పటిమకు తాళలేక ఆ దొంగ అక్కడ్నుంచి పలాయనం చిత్తగించాడు. సేలం సమీపంలోని అరసిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెల్ వైరల్గా మారింది. ఆ వృద్ధుడు చూపిన తెగువకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
తిరునల్వేలి ఘటన మరువకముందే..
ఇక తిరునల్వేలిలో వృద్ధ దంపతులు చూపిన తెగువను గుర్తు చేసుకుంటే.. 70ఏళ్ల షణ్ముగవేల్ అనే వృద్ధుడి ఇంటిపై ఇద్దరు దొంగలు పెద్ద కత్తులతో దాడికి పాల్పడ్డారు. మొదట వృద్ధుడి గొంతుకు టవల్ బిగించి కత్తితో దాడి చేయబోయారు దొంగలు. అయితే, భార్యతో కలిసి ఆ వృద్ధుడు దొంగలను తీవ్రంగా ప్రతిఘటించారు.
దొంగల వద్ద కత్తులున్నా.. బెదరకుండా..
ప్లాస్టిక్ కుర్చీలు, చెప్పులు, బకెట్లతో దొంగలపై ఆ వృద్ధ దంపతులు ఎదురుదాడికి దిగారు. దొంగల వద్ద పెద్ద కత్తులు ఉన్నప్పటికీ ఏమాత్రం బెదరకుండా ఆ వృద్ధులు వారిని ప్రటిఘటించారు. దీంతో ఆ దొంగలు అక్కడ్నుంచి పారిపోయారు.
ధైర్య సాహసాలకు అవార్డు..
ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వృద్ధ దంపతులపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 11న జరిగిన ఈ ఘటనలో వృద్ధ దంపతులు చూపిన తెగువకు మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. స్వాతంత్ర్య దినోవ్సం సందర్భంగా వారికి ప్రత్యేక సాహస అవార్డును అందించడం గమనార్హం.