తమిళనాడు ఎంపీల సామూహిక రాజీనామా ? మోడీపై ఒత్తిడి, మరో జల్లికట్టు ఉద్యమం!
చెన్నై: తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు కావేరీ నీటి వాటా కోసం సామూహిక రాజీనామాలు చెయ్యడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. తమిళనాడు ఎంపీల దగ్గర రాజీనామా చేయించాలని శనివారం అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన రైతు సంఘం నాయకులు వేర్వేరుగా చర్చలు జరిపి ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయంపై రెండు పార్టీల నాయకులు అధికారికంగా మాత్రం బయటకు చెప్పడం లేదు. అయితే ఎంపీలు సామూహిక రాజీనామాలు చేసి ప్రధాని మోడీ మీద ఒత్తిడి తెస్తారని ప్రజలు, రైతులు గట్టిగా నమ్ముతున్నారు.
పళని, పన్నీర్, స్టాలిన్
కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి చెయ్యాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ శనివారం సచివాలయంలో సుధీర్ఘంగా చర్చించారు.
మౌనంగా మోడీ
కావేరి నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ప్రధాని మోడీ కర్ణాటకకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేస్తే కర్ణాటకలోని రైతులు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర నాయకులు ఇప్పటికే అమిత్ షాకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంలో ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు.
తమిళనాడులో నిరసన
కావేరీ నీటి పంపిణి విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగినా ఇక్కడి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని కావేరీ డెల్టా ప్రాంత ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కావేరీ డెల్టా ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యాలని స్థానిక ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీల సామూహిక రాజీనామాలు ?
కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే పార్టీలకు అతీతంగా తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యుల దగ్గర సామూహిక రాజీనామాలు చేయించాలని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు భావిస్తున్నాయని సమాచారం.
జల్లికట్టు తరహా ఆందోళన
కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం చెయ్యాలని విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు నిర్ణయించారని తెలిసింది.