అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూస్తారు..నాది గ్యారంటీ: తలైవా సంచలనం
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండీ, లేనట్టుగా, ఉన్నారో, లేదో తెలియనట్టుగా గుంభనంగా వ్యవహరిస్తూ వస్తోన్నారాయన. సహ నటుడు, తోటి సూపర్ స్టార్ కమల్ హాసన్ స్థాపించిన మక్కళ్ నీథి మయ్యం (ఎంఎన్ఎం)తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటన చేసిన మరుసటి రోజే.. అలాంటి సంచలన ప్రకటనే మరొకటి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళనాడు ప్రజలు ఓ అద్భుతాన్ని చవి చూస్తారని, దానికి తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఎలాంటి అద్భుతాన్ని చూస్తారనేది తాను ఇప్పుడు చెప్పనని అన్నారు. ముందే వెల్లడిస్తే అది అద్భుతం ఎలా అవుతుందంటూ తనదైన శైలిలో చిరునవ్వు నవ్వారు తలైవా. రజినీకాంత్ చేసిన ఈ ఒకే ఒక్క లైన్ ప్రస్తుతం.. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలను పుట్టిస్తోంది.
కమల్ తో చేతులు కలపడం ఖాయమేనా?
సమీప భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య సమీకరణలు చోటు చేసుకుంటాయనడానికి రజినీకాంత్ చేసిన తాజా ప్రకటన ఓ నాందీవాచకంలా కనిపిస్తోందనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతున్నాయి. కమల్ హాసన్ తో తనకు శతృత్వం లేదని, 40 సంవత్సరాలుగా తామిద్దరం స్నేహితులుగా ఉంటున్నామని, ఆయనతో రాజకీయాల్లో కలిసి పని చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని బుధవారమే వెల్లడించారు. ఆ మరుసటి రోజే అద్భుతాలు చూస్తారంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం వెనుక కారణం ఏమై ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2021లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2016లో ముగిశాయి. నాటి ఎన్నికల సందర్భంగా జయలలిత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె సారథ్యంలోని అన్నాడీఎంకే అధికారాన్ని నిలుపుకొంది. కరుణానిధి సారథ్యంలోని డీఎంకే మరోసారి ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే జయలలిత అనారోగ్యం పాలు కావడం, చెన్నై అపోలో ఆసుపత్రిలో 76 రోజుల సుదీర్ఘ కాలం పాటు చికిత్స పొందుతూ కన్నుమూయడం వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.
బీజేపీతో సీట్ల సర్దుబాటు..
ప్రస్తుతం అన్నా డీఎంకే ప్రభుత్వానికి ఎడప్పాడి పళనిస్వామి సారథ్యం వహిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీతో సీట్లు సర్దుబాటు చేసుకుని మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. దారుణ పరాజయాన్ని చవి చూసింది. 39 లోక్ సభ స్థానాలు ఉన్న తమిళనాడులో 36 చోట్ల ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగురవేశారు. డీఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంది.
కమల్-రజినీ కలిస్తే..
ఈ పరిస్థితుల్లో కమల్ హాసన్, రజినీకాంత్ చేతులు కలిపితే.. ఈ తరువాత సంభవించే పరిణామాలు గానీ, సమీకరణాలు గానీ, ఫలితాలు గానీ అనూహ్యంగా ఉంటాయని చెబుతున్నారు విశ్లేషకులు. జయలలిత లేని అన్నా డీఎంకే బలహీనపడిందని, ప్రస్తుతం ప్రత్యామ్నాయ పార్టీగా డీఎంకే ఒక్కటే కనిపిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కమల్ హాసన్ స్థాపించిన మక్కళ్ నీథి మయ్యంతో రజినీకాంత్ చేతులు కలిపితే.. ఆయన చెప్పినట్టే అద్భుతాలు జరగడానికి అవకాశం లేకపోలేదనీ అంటున్నారు.