ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు డ్రైవర్..కండక్టర్ సహా 20 మంది దుర్మరణం..క్రేన్లు, గ్యాస్ కట్టర్లు
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టారు.
నాలుగు రోజుల్లో ట్రంప్ పర్యటన: రోమియో డీల్కు గ్రీన్ సిగ్నల్: మోడీ సర్కార్ కీలక నిర్ణయం .. !
కేరళ ఆర్టీసీ బస్సును ఢీ కొన్న కంటైనర్
గురువారం తెల్లవారు జామున 3:15 నిమిషాల సమయంలో కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం రాత్రి బెంగళూరులోొని శాటిలైట్ బస్ స్టేషన్ నుంచి కేరళలోని ఎర్నాకుళానికి 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది వోల్వో బస్సు. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయానికి ఎర్నాకుళానికి చేరుకోవాల్సి ఉంది.
కోయంబత్తూరు వద్ద ఢీ కొన్న కంటైనర్..
మార్గమధ్యలో కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. మరో 20 నిమిషాల్లో కోయంబత్తూరుకు చేరుకోవాల్సి ఉన్న వోల్వో బస్సును ఓ కంటైనర్ అతి వేగంగా ఢీ కొట్టింది. ఏ రేంజ్లో కంటైనర్ ఢీ కొట్టిందంటే. బస్సు కుడి వైపు భాగం మొత్త తుక్కుతుక్కుగా మారింది. ఆ వరుసలో కూర్చున్న ప్రయాణికుల్లో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. బస్సు కుడివైపు భాగం మొత్తం చీల్చుకుపోయింది.
క్రేన్లను తెప్పించి..
కంటైనర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు తలుపులు బిగుసుకునిపోయాయి. ఎడమవైపు ఉన్న కిటికీలదీ అదే పరిస్థితి. ప్రమాదం చోటు చేసుకున్న రెండు గంటల వరకు కూడా బస్సులో నుంచి ఏ ఒక్క ప్రయాణికుడు కూడా బయటికి రాలేని దుస్థితిని ఎదుర్కొన్నారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బస్సులోపల చిక్కుకుపోయిన ప్రయాణికులు రక్షించడానికి క్రేన్ను రప్పించారు. గ్యాస్ కట్టర్లను తెప్పించారు. ఒక్కరొక్కరుగా కిటికీ నుంచి బయటికి తీసుకొచ్చారు.
అయిదుమంది గుర్తింపు..
మృతుల్లో అయిదుమందిని గుర్తించారు. వినోద్, క్రిస్టొఫర్, రహీమ్, నివిన్ బేబీ, సోనా సన్నీ మృత్యువాత పడ్డారు. సోనా సన్నీ పాలక్కాడ్ నివాసి కాగా మిగిలిన నలుగురు త్రిశూర్కు చెందిన వారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని కోయంబత్తూరు, తిరుప్పూర్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
సంఘటనా స్థలం.. భయానకం..
ఈ మధ్యకాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంగా భావిస్తున్నారు. ఆర్టీసీ రోడ్డు ప్రమాదానికి గురి కావడం, ఏకంగా 20 మంది దుర్మరణం పాలు కావడం కేరళను ఉలిక్కిపడేలా చేసింది. తమ వారి యోగ క్షేమాల కోసం ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేరళ రవాణా శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ స్పందించారు. కేరళ ఆర్టీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ను సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాలని ఆదేశించారు. గాయపడ్డ వారందరికీ వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.